
ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ పోరాడే స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసి.. ముంబై ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రాజస్థాన్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ (41; 32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు), యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (32; 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) మెరుపులు మెరిపించారు. కెప్టెన్ సంజు శాంసన్ (42; 27 బంతుల్లో 5 ఫోర్లు), హిట్టర్ శివమ్ దూబే (35; 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో రాహుల్ చహర్ రెండు వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా తలో వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్కు అదిరే ఆరంభం దక్కింది. ఓపెనర్లు జోస్ బట్లర్, యశస్వి జైశ్వాల్ దంచికొట్టారు. ఇద్దరూ బౌండరీలు, సిక్సులతో హోరెత్తించారు. అదే సమయంలో స్ట్రైక్ కూడా రొటేట్ చేశారు. ఈ క్రమంలో తొలి వికెట్కు 66 పరుగులు జోడించారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న వీరిద్దరినీ స్పిన్నర్ రాహుల్ చహర్ వరుస ఓవర్లలో పెవిలియన్ పంపాడు. 8వ ఓవర్లో బట్లర్ను స్టంపౌట్ చేసిన ముంబై చహర్.. తన తర్వాతి ఓవర్లో యశస్విని క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు. అప్పటికి రాజస్థాన్ పది ఓవర్లకు 91/2తో మెరుగైన స్థితిలోనే నిలిచింది.
ఆపై సంజూ శాంసన్, శివమ్ దూబే బాధ్యత తీసుకున్నారు. అయితే ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో రాజస్థాన్ మధ్య ఓవర్లలో మెరుపు బ్యాటింగ్ చేయలేకపోయింది. శాంసన్ కాస్త వేగంగా ఆడినా.. దూబే మెరుపులు కొన్ని బంతులకే పరిమితం అయ్యాయి. ధాటిగా ఆడే క్రమంలో ఏ ఇద్దరు ఔటయ్యారు. బౌల్ట్ సంజూను బౌల్డ్ చేయగా.. దూబేను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. చివరికి డేవిడ్ మిల్లర్ (7), రియాన్ పరాగ్ (8) పరుగులతో నాటౌట్గా నిలిచారు. డెత్ ఓవర్లలో ముంబై బౌలర్లు కట్టడిచేయడంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని రాయల్స్ కోల్పోయింది. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ కూడా 171 పరుగులే చేయడం విశేషం.