బౌలర్ల శ్రమ చివరి వరకూ..
స్కోరు తక్కువే అయినప్పటికీ.. దాన్ని ఛేదించడానికి ఢిల్లీ కేపిటల్స్ చివరి వరకూ శ్రమించాల్సి వచ్చింది. 138 పరుగులు చేయడానికి చివరి ఓవర్ వరకూ ఆడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ను ఢిల్లీ బౌలర్లు ముప్పతిప్పలు పెట్టారు. ప్రత్యేకించి- అమిత్ మిశ్రా. అతని స్పిన్ మాయాజాలానికి ముంబై బ్యాట్స్మెన్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. మిడిలార్డర్ను కుప్పకూల్చాడతను. నాలుగు వికెట్లు పడగొట్టాడు. నాలుగు ఓవర్ల కోటాలో 24 పరుగులు ఇచ్చి, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్లను పెవిలియన్ చేర్చాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ముంబై తొమ్మిది వికెట్లు కోల్పోయి 137 పరుగులే చేయగలిగింది.
ముంబై బౌలర్లు కూడా కట్టుదిట్టంగా..
138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ కేపిటల్స్.. చివరి వరకూ శ్రమించాల్సి వచ్చింది. ముంబై బౌలర్లు వికెట్లను తీయలేకపోయినప్పటికీ..పొదుపుగా బౌలింగ్ చేయగలిగారు. చివరికంటా మ్యాచ్ను తీసుకెళ్లారు. చివరి ఓవర్ రెండోబంతికి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ పృథ్వీ షా మరోసారి విఫలం అయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఎప్పట్లాగే జట్టుకు అండగా నిలిచాడు. 42 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఇందులో సిక్సర్ ఒకటే. అయిదు ఫోర్లు బాదాడు. వన్డౌన్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ కుదురుకున్నాడు. 29 బంతుల్లో నాలుగు ఫోర్లతో 33 పరుగులు చేశాడు.
చెపాక్ పిచ్పై తొలి విజయం
ఈ మ్యాచ్ విజయంతో ఢిల్లీ కేపిటల్స్.. ఓ అన్ వాంటెడ్ ట్రెడీషన్కు చెక్ పెట్టింది. చెన్నై చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియం పిచ్పై తొలి విజయాన్ని అందుకుంది. అచ్చిరాని పిచ్పై తన చిరకాల ప్రత్యర్థిపై పైచేయి సాధించడాన్ని ఢిల్లీ మేనేజ్మెంట్ శుభ శకునంగా భావిస్తోంది. గత ఏడాది దుబాయ్ వేదికగా సాగిన ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్లో ఓటమికి ప్రతీకారాన్ని తీర్చుకున్నట్లుగా భావిస్తోంది. టైటిల్ హాట్ ఫేవరెట్ను ఓడించడంతో ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసినట్టయింది. ఇదే పిచ్పై ఢిల్లీ కేపిటల్స్ జట్టున తన తదుపరి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఢీ కొట్టబోతోంది. ఈ నెల 25వ తేదీన ఆదివారం ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.
ముంబై అకౌంట్లో మరో ఓటమి..
సీజన్ ప్రారంభంలో ఓ మాదిరిగా ఉంటూ.. టోర్నమెంట్ సాగే కొద్దీ రాటుదేలే సత్తా రోహిత్ శర్మ టీమ్కు ఉంది. తొలి మ్యాచ్లో ఓటమిని చవి చూసింది. మిగిలిన రెండింట్లోనూ విజయం సాధించింది. నాలుగో మ్యాచ్లో మళ్లీ చతికిల పడింది. ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం నాలుగు పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే.. ఆరు పాయింట్లతో రెండో స్థానాన్ని ఖాయం చేసుకునే అవకాశాన్ని చేతులారా పోగొట్టుకుంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్.. చివర్లో జయంత్ యాదవ్ మినహా మరెవరూ రెండంకెలను అందుకోలేకపోయారు.
సెకెండ్ ప్లేస్లో డీసీ..
ఢిల్లీ కేపిటల్స్ గెలిచినా.. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. మూడో స్థానం నుంచి మరింత పైకి ఎగబాకింది. రెండో స్థానానికి చేరుకుంది. మూడు విజయాలు, ఒక ఓటమితో ఆ జట్టు అకౌంట్లో ఆరు పాయింట్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయాలతో ఆ స్థానాన్ని అందుకుందా టీమ్. గురువారం ఆ జట్టు రాజస్థాన్ రాయల్స్ను ఢీ కొటుంది.