
చెన్నై: అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్కు మరికొద్ది నిమిషాల్లోనే తెర లేవబోతోంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్తో తొలి టైటిల్ కోసం ఆరాటపడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడబోతోంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. దేవ్దత్ పడిక్కల్ మ్యాచ్ ఆడడం లేదు. అతని స్థానంలో రజత్ పాటిదార్ ఆడుతున్నాడు. బెంగళూరు తరఫున మ్యాక్స్వెల్, జేమీసన్, క్రిస్టియన్ అరంగేట్రం చేస్తున్నారు. ఇక ముంబై తరఫున మాక్రో జాన్సన్ ఆడుతున్నాడు.
చెపాక్ పిచ్ బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉంటుంది. స్పిన్నర్లకు మాత్రం బాగా అనుకూలిస్తుంది. అయినా 150కి పైగా స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి హిట్టర్లు ఉండడంతో భారీ స్కోర్ ఖాయంగా కనిపిస్తోంది. అయితే జయంత్ యాదవ్, రాహుల్ చాహర్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్ లాంటి నికార్సైన స్పిన్నర్లు వీరిని ఎలా కట్టడి చేస్తారో చూడాలి. తొలి మ్యాచ్లో విజయం సాధించి ఈ సీజన్లో శుభారంభం చేయాలని రెండు జట్లూ భావిస్తున్నాయి. దాంతో ఈ మ్యాచ్పై తీవ్ర ఆసక్తి నెలకొంది.
ముఖాముఖి రికార్డులో బెంగళూరుపై ముంబైదే పైచేయి. ఇరు జట్లు ఇప్పటి వరకు 27 సార్లు తలపడగా.. 17 సార్లు ముంబైనే విజయం సాధించింది. ఆర్సీబీ కేవలం 10 సార్లు మాత్రమే గెలుపొందింది. గత సీజన్లో మాత్రం చెరొక విజయాన్నందుకున్నాయి. ఒక మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. అయితే గత 8 సీజన్లు ముంబై ఫస్ట్ మ్యాచ్ గెలవలేదు. మరీ ఈసారైనా శుభారంభం చేస్తుందో లేదో చూడాలి.
తుది జట్లు:
ముంబై: రోహిత్ శర్మ, క్రిస్ లిన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, హార్డిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, మార్కో జాన్సెన్, రాహుల్ చహర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్.
బెంగళూరు: రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్వెల్, డేనియల్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, కైల్ జేమీసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చహల్.
MI vs RCB: ఆసక్తికర సమరం.. పేసుగుర్రం బుమ్రా బౌన్సర్లకు కింగ్ కోహ్లీ జవాబు ఇచ్చేనా?