డాట్ బాల్స్ ఆడి ఓడించాడు
సీజన్ తొలి మ్యాచులో కోల్కతా నైట్రైడర్స్ చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. కోల్కతా నిర్దేశించిన 189 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరెంజ్ ఆర్మీ గెలుపు అంచుల వరకు వెళ్లి చతికిలబడింది. జానీ బెయిర్స్టో (55; 40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) ఔటయ్యే సమయానికి సన్రైజర్స్ 42 బంతుల్లో 86 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సమయంలో విజయ్ శంకర్ (11: 7 బంతుల్లో), అబ్దుల్ సమద్ (19 నాటౌట్: 8 బంతుల్లో) ధాటిగా ఆడారు. కానీ మనీశ్ పాండే (61 నాటౌట్: 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు) మాత్రం ఎక్కువగా సింగిల్స్, డబుల్స్కే పరిమితమయ్యాడు. 14వ ఓవర్లో ఒక సిక్స్ బాదిన మనీశ్.. ఆ తర్వాత చివరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఒక్క బౌండరీ బాధలేదు. డాట్ బాల్స్ మరి ఎక్కువగా ఆడాడు. మనీశ్ బౌండరీలు బాదుంటే సన్రైజర్స్ మ్యాచ్ గెలిచేదే.
39 బంతుల్లో 38 రన్స్
ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన రెండో మ్యాచ్లో 6 పరుగుల తేడాతో ఆరెంజ్ ఆర్మీ ఓడిపోయింది.150 పరుగుల లక్ష్య ఛేదనలో 9 వికెట్లకు 143 పరుగులే చేసింది. ఒకానొక దశలో సన్రైజర్స్ విజయానికి 24 బంతుల్లో 35 పరుగులు చేయాల్సి రాగా.. అనూహ్యంగా ఓడిపోయింది. కోల్కతాపై నెమ్మదిగా ఆడిన మనీశ్ బెంగళూరుపై అలానే ఆడాడు. 39 బంతుల్లో 38 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి. మనీష్ బౌండరీల ద్వారానే 20 రన్స్ చేశాడు. మ్యాచులో డాట్ బాల్స్ ఎక్కువగా ఆడాడు. అవసరం అయిన సమయంలో ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. డాట్ బాల్స్ ఎక్కువగా ఆడుతూ జట్టు ఓటమికి కారణం అయ్యాడు.
7 బంతుల్లో రెండు పరుగులు
ఇక శనివారం ముంబై ఇండియన్స్పై 13 పరుగుల తేడాతో ఆరెంజ్ ఆర్మీ ఓడిపోయింది. 151 మోస్తరు లక్ష్య ఛేదనలో మెరుపు ఆరంభం లభించినా.. ఫినిషింగ్ లోపంతో ఐపీఎల్ 14వ సీజన్లో వార్నర్ సేన పరాజయాల హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. బెయిర్స్టో (43; 22 బంతుల్లో 3×4, 4×6), వార్నర్ (36; 34 బంతుల్లో 2×4, 2×6) మెరుపులతో 5 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. బెయిర్స్టో ఔట్ అనంతరం క్రీజులోకి వచ్చిన మనీష్.. పూర్తిగా నిరాశపరిచాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ సారథికి అండగా నిలవాల్సిన సమయంలో పేలవ షాట్ ఆడి వెనుదిరిగాడు. 7 బంతుల్లో రెండు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మనీష్.. వార్నర్కు సహకరిస్తే పరిస్థితి మరోలా ఉండేది.
|
మాక్స్వెల్, మోరిస్ వచ్చేవాళ్లు
మూడు మ్యాచుల్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమికి కారణమైన మనీష్ పాండేపై ఆ జట్టు అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పాండేపై మీమ్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'గత వేలంలో పాండేను రిలీస్ చేస్తే హైదరాబాద్కు 11 కోట్లు మిగిలేవి. ఆ ధరకు గ్లెన్ మాక్స్వెల్, క్రిస్ మోరిస్ వచ్చేవాళ్లు. ఇక సన్రైజర్స్ను ఆ దేవుడే కాపాడాలి' అని ఒకరు కామెంట్ చేయగా.. 'మనీష్, శంకర్లను ఆడిస్తూనే ఉండండి. తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయవద్దు. కేన్ మామను అసలు ఆడనివ్వకండి. అద్భుతమైన ఆట' అని మరొకరు ట్వీట్ చేశారు. 'మనీష్ పాండే ఇలా ఆడుతున్నప్పుడు.. ప్లేఆఫ్ విషయం మర్చిపోండి', 'చెత్త ఎంపిక.. బలహీనమైన మిడిల్ ఆర్డర్ ఉందని తెలిసి కూడా అనుభవం లేని ఆటగాళ్లకు అవకాశం ఇస్తున్నారు. ప్రతిభావంతులైన ఆటగాళ్లను డగౌట్లో కూర్చోపెట్టండి' అంటూ ఫైర్ అవుతున్నారు.