
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14 ఎడిషన్ ప్రారంభ మ్యాచుల్లోనే చెన్నై సూపర్ కింగ్స్ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఆడిన తొలి మ్యాచ్లో ఓడిపోయిన ఘటన నుంచి తేరుకోకముందే ధోనీ సేనకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇద్దరు స్టార్ ప్లేయర్లు జట్టుకు దూరం కానున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆడబోయే తదుపరి మ్యాచ్కు వారు అందుబాటులో ఉండట్లేదు. ఈ విషయాన్ని జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ధృవీకరించారు. తదుపరి మ్యాచ్లకు వారిద్దరు ఆడట్లేదని స్పష్టం చేశారు. వారే- లుంగి ఎంగిడి, జేసన్ బెహ్రెన్డార్ఫ్.
ఐపీఎల్ 2021లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్.. తన తదుపరి మ్యాచ్ను పంజాబ్ కింగ్స్తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ వచ్చే శుక్రవారం సాయంత్రం ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఆరంభమౌతుంది. క్రిస్ గేల్, డేవిడ్ మలాన్, కేఎల్ రాహుల్, నికొలస్ పూరన్ వంటి హార్డ్ హిట్టర్లతో నిండి ఉందా జట్టు. పంజాబ్ కింగ్స్కు కూడా అది రెండో మ్యాచే అవుతుంది. దాని కంటే ఆ జట్టు సోమవారం రాజస్థాన్ రాయల్స్ను ఢీ కొట్టాల్సి ఉంది. బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్న పంజాబ్ కింగ్స్ను ఢీ కొట్టాలంటే చెన్నై సూపర్ కింగ్స్లో ఇప్పుడున్న బౌలింగ్ వనరులు ఏ మాత్రం సరిపోవనేది ఢిల్లీ కేపిటల్స్తో జరిగిన మ్యాచ్లో స్పష్టమైంది.

188 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం ధోనీ సేన కాపాడుకోలేకపోయింది. డీసీ ఓపెనర్లు శిఖర్ ధవన్, పృథ్వీ షా బ్యాటింగ్ దాడి ముందు చెన్నై బౌలర్లు చేతులెత్తేశారు. ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయారు. ఫలితంగా ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది ఢిల్లీ. ఈ పరిణామాల మధ్య ఇద్దరు స్టార్ బౌలర్లు జట్టుకు దూరం కావడం ఇబ్బందికరమే. లుంగి ఎంగిడి, జేసన్ బెహ్రెన్డార్ఫ్ ఇద్దరూ మీడియం పేసర్ బౌలర్లు. వైవిధ్యంగా బంతులను సంధించే సత్తా వారికి ఉంది.
ఢిల్లీ కేపిటల్స్తో జరిగిన మ్యాచ్లో వారిద్దరూ అందుబాటులో లేరు. ఆడిన బౌలర్లెవరూ ప్రభావవంతంగా బౌలింగ్ చేయలేకపోయారు. శార్దుల్ ఠాకూర్.. భారీగా పరుగులను సమర్పించుకున్నాడు. ఈ పరిస్థితుల్లో ఎంగిడి, జేసన్ బెహ్రెన్డార్ఫ్లల్లో ఎవరో ఒకరిని ఆడించాలని మేనేజ్మెంట్ భావించినప్పటికీ.. వారిద్దరూ రెండో మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోయారు. దీనితో మరోసారి తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి చెన్నై సూపర్ కింగ్స్కు ఏర్పడినట్టయింది.