
కోల్కతా: ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 కోసం ఆయా జట్లు తమ సాధనను ముమ్మరం చేశాయి. చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మార్చి 31 నుండి ట్రైనింగ్ సెషన్ను ప్రారంభించనుంది. కోల్కతా నైట్ రైడర్స్ కూడా త్వరలోనే తమ ట్రైనింగ్ క్యాంప్ను ప్రారంభింస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆటగాళ్లు, సిబ్బంది ఏడు రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని కోల్కతా జట్టు యాజమాన్యం ప్రకటించింది. అందుకు ఏర్పాట్లు కూడా చేసింది.
అయితే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తమ అభిమానుల కోసం స్పెషల్ ఐపీఎల్ 'క్వారంటైన్' సాంగ్ను విడుదల చేసింది. కరోనా కారణంగా గతేడాది మ్యాచ్లు ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించగా.. ఈ సీజన్లోనూ అదే పరిస్థితి నెలకొననుంది. వరుసగా రెండో సీజన్లోనూ ఐపీఎల్ మ్యాచ్లను వీక్షించడాన్ని అభిమానులు కోల్పోతున్నందున ఫ్యాన్స్కు అంకితం చేస్తూ ఈ పాటను రూపొందించారు. 'వీ విల్ మిస్ యూ' అంటూ సాగే ఈ పాటను కేకేఆర్ తమ ట్విటర్ ఖాతా ద్వారా రిలీజ్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.
కోల్కతా నైట్ రైడర్స్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫాస్ట్ బౌలర్ కమలేష్ నాగర్కోటి, స్టార్ బ్యాట్స్మన్ రాహుల్ త్రిపాఠి తదితరులు ఆదివారం నుంచి ప్రారంభమైన క్వారంటైన్లో చేరారు. ఏ జట్టుకు కూడా తమ సొంత మైదానాల్లో మ్యాచ్లు ఆడే వెసులుబాటు లేకపోవడంతో.. ఆయా జట్లు తటస్థ వేదికలపై మ్యాచ్లు ఆడనున్నాయి. కోల్కతా తమ మ్యాచ్లను చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై నగరాల్లో ఆడనుంది. ఏప్రిల్ 11న కోల్కతా తమ తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది.
ఐపీఎల్ 2021 వేలంలో కోల్కతా కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
షకీబ్ అల్ హసన్ (రూ.3.2 కోట్లు), హర్భజన్ సింగ్ (రూ.2 కోట్లు), బెన్ కటింగ్ (రూ.75 లక్షలు), కరుణ్ నాయర్ (రూ.50 లక్షలు), పవన్ నేగి (రూ.50 లక్షలు), వెంకటేశ్ అయ్యర్ (రూ.20 లక్షలు), షెల్డన్ జాక్సన్ (రూ.20 లక్షలు), వైభవ్ అరోరా (రూ.20 లక్షలు).