
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదుపరి సీజన్ కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ఐపీఎల్ 2021 సీజన్కి సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కసరత్తుల్ని ప్రారంభించింది. ఐపీఎల్ 14వ సీజన్ కోసం ఫిబ్రవరి 11న మినీ వేలం జరుగనుందని సమాచారం. ఇక ఐపీఎల్ 2021 ఏప్రిల్ 10 తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటన ముగిసిన అనంతరం స్వదేశంలోనే ఐపీఎల్ ఆరంభం అవుతుందని తెలుస్తోంది.
జనవరి 20లోగా ఫ్రాంఛైజీలు తాము వద్దనుకున్న ఆటగాళ్లను విడిచిపెట్టడంతో పాటు జట్ల మధ్య ఆటగాళ్ల (తమకు కావాల్సిన) బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని ఐపీఎల్ పాలకమండలి ఫ్రాంఛైజీలకు సూచించినట్లు తెలిసింది. దీంతో అన్ని జట్లు కసరత్తుల్ని ప్రారంభించాయి. ఈ క్రమంలో గత రెండు ఐపీఎల్ సీజన్లలో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టులో స్టార్ క్రికెటర్లు ఉన్నప్పటికీ కనీసం ప్లేఆఫ్ బెర్తు దక్కించుకోలేకపోయింది. కోల్కతా ఫ్రాంఛైజీ తమకు వద్దనుకున్న ఆటగాళ్లను జనవరి 20 లోపే విడుదల చేసే అవకాశం ఉంది.
మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (7.4కోట్లు), స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (5.8 కోట్లు)లను వదులుకోవాలని కేకేఆర్ ఫ్రాంఛైజీ భావిస్తున్నట్లు సమాచారం తెలిసింది. జట్టులో ప్రతిభావంతులైన వికెట్ కీపర్లు టామ్ బాంటన్, నిఖిల్ నాయక్లు ఉన్నారు. అందుకే కార్తీక్ను విడిపెట్టాలని చూస్తోంది. స్పీడ్స్టర్ పాట్ కమిన్స్ (15.5కోట్లు), ఆండ్రీ రస్సెల్ (8.5కోట్లు), సునీల్ నరైన్ (12.5కోట్లు)లను జట్టులో కొనసాగించాలా? లేదా వదిలించుకోవాలా? అనేదానిపై ఫ్రాంఛైజీ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.
రాబోయే ఐపీఎల్-2021 సీజన్ కోసం అత్యుత్తమ జట్టును తయారు చేసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మంచి క్రేజ్, ప్రతిభ ఉన్నప్పటికీ స్థాయి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన ఆటగాళ్లను వదిలించుకోవడానికి సిద్ధమైంది. చెన్నై క్యాంప్ నుంచి వస్తున్న సమాచారం మేరకు ఆల్రౌండర్ కేదార్ జాదవ్తో పాటు కనీసం 7-8 మంది స్టార్ ఆటగాళ్లను జనవరి 20 గడువుకు ముందే రిలీజ్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.