
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఆరంభానికి ముందే కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)కు భారీ షాక్ తగిలింది. కేకేఆర్ స్టార్ బ్యాట్స్మన్ నితీష్ రాణాకు కరోనా సోకింది. గురువారం రాణాకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం రాణా ముంబైలోని కేకేఆర్ టీమ్ బసచేస్తున్న హోటల్లో క్వారెంటైన్లో ఉన్నాడు. వైద్యులు నిరంతరం ఆయను పరీక్షిస్తున్నారు. అయితే రాణాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని సమాచారం.
సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ మరియు విజయ్ హజారే ట్రోఫీ రెండింటిలోనూ ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నితీష్ రాణా.. ఇటీవల గోవాకు వెళ్లాడు. అక్కడ సేదతీరిన అతడు.. రెండు రోజుల క్రితం కోల్కతా నైట్రైడర్స్ జట్టుతో కలిశాడు. జట్టుకు రిపోర్ట్ చేసే సమయంలో కరోనా టెస్ట్ చేయగా రాణాకు నెగటివ్ రిపోర్ట్ రాగా.. తాజాగా ఫలితాల్లో పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో హోటల్లో క్వారెంటైన్లో ఉన్నాడు. సీజన్ ప్రారంభానికి ముందే రాణా కరోనా బారిన పడడంతో మొదటి మ్యాచ్ ఆడడం అనుమానంగానే ఉంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ను ఏప్రిల్ 11న సన్రైజర్స్తో కోల్కతా ఆడనుంది.
కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు నితీష్ రాణా కీలక బ్యాట్స్మన్. టాప్-3లో బ్యాటింగ్ చేస్తాడు. కీలక సమయంలో పరుగులు చేస్తూ జట్టుకు మంచి ఆరంభాలు అందిస్తున్నాడు. రాణా గత నాలుగు ఐపీఎల్ సీజన్లలో నిలకడగా రాణిస్తూ.. ప్రతిసారి 300 పరుగులకు పైగా చేశాడు. యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020లో 138.58 స్ట్రైక్ రేట్తో 352 పరుగులు చేశాడు. రాణా 60 ఐపీఎల్ మ్యాచులలో 1437 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 87. 11 హాఫ్ సెంచరీలు చేశాడు.
ఐపీఎల్లో కేకేఆర్ ప్రయాణం ఒడుదొడుకులతో సాగుతుంది. తొలి మూడు సీజన్లలో లీగ్ దశలోనే ఇంటిబాట పట్టిన కేకేఆర్.. గౌతమ్ గంభీర్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 2012, 2014 సీజన్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత గంభీర్ ఢిల్లీకి వెళ్ళిపోయినప్పయికీ.. ప్లేఆఫ్ వరకూ వెళ్తూ వచ్చింది. అయితే గత రెండు సీజన్లుగా ప్రదర్శన మరీ పేలవంగా మారింది. గతేడాది దినేశ్ కార్తీక్ మధ్యలోనే సారథ్య బాధ్యతలను ఇయాన్ మోర్గాన్కు కట్టబెట్టాడు. అయినప్పటికీ జట్టు తలరాత మారలేదు. ఈసారి ఎలా ఆడుతుందో చూడాలి.