
లండన్: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఆటను ఎక్కువగా ఆస్వాదిస్తానని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ తెలిపాడు. నిలకడగా ఆడే బ్యాట్స్మన్ కాదనే అపవాదు నుంచి శాంసన్ బయటపడాలని కోరుకున్నాడు. శాంసన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అతని షాట్లు కొట్టే తీరు ముచ్చటగా ఉంటుందన్నాడు. ఐపీఎల్ 2021లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో అతడు చేసిన సెంచరీ తనను ఎంతో ఆకట్టుకుందని పీటర్సన్ చెప్పాడు. స్టీవ్ స్మిత్ను రాయల్స్ ఈసారి వేలంలోకి వదిలేయడంతో శాంసన్ ఆ జట్టు పగ్గాలు అందుకున్నాడు.
తాజాగా కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ... 'ప్రతీ ఏడాది సంజు శాంసన్ ఆటను ఆస్వాదిస్తా. అతడు షాట్లను నేను బాగా ఇష్టపడతా. గతేడాది ఐపీఎల్లో నేను కామెంటరీ ఎక్కువగా చెప్పాను. ఎక్కువగా అతని నిలకడ గురించి మాట్లాడా. ఐపీఎల్ 2020లో శాంసన్ మధ్యలో ఫామ్ను కోల్పోయాడు. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో నాలుగు పరుగులే చేసి ఔటయ్యాడు. అది అతనికి రెండో మ్యాచే. ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నందున విమర్శలు అనవసరం. ప్రస్తుతం అతని బాధ్యతలు వేరే స్థాయిలో ఉన్నాయి. అతడు రాయల్స్ కెప్టెన్. స్టోక్స్ లేని లోటును పూడ్చుకోవాల్సిన అవసరం శాంసన్పై ఉంది' అని అన్నాడు.
సంజు శాంసన్ అంతర్జాతీయ కెరీర్ గురించి కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ... 'భారత్ తరఫున ఏ పరిస్థితుల్లోనైనా తన పవర్ ప్లే క్రికెట్తో ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. పరుగులు చేసిన తర్వాత.. ఇంకా పరుగులు చేస్తాడు. అలానే చాలాసార్లు విఫలం కూడా అయ్యాడు. అటువంటి సమయంలో డెడికేషన్ అవసరం. అతను అంతర్జాతీయ స్థాయి ఆడే క్రికెటర్. అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఒకసారి క్లిష్ట సమయం వచ్చిందంటే.. అది మరిన్ని సమస్యల్ని తీసుకొస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ ఆడే పరిస్థితుల్ని మరింత క్లిష్టం చేసుకోవద్దు' అని సూచించాడు.
ఐపీఎల్ 2021లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానంలో ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో రాయల్స్కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. మహ్మద్ సిరాజ్ సూపర్ బంతులతో తన వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టాడు. మూడో ఓవర్లో జోస్ బట్లర్ (8)ను బౌల్డ్ చేసిన సిరాజ్.. ఐదో ఓవర్లో డేవిడ్ మిల్లర్ను (0) పెవిలియన్ పంపాడు. కైల్ జేమీసన్ కూడా నాలుగో ఓవర్లో మనన్ వోహ్రా (7)ను ఔట్ చేశాడు. దీంతో రాజస్థాన్ 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ సంజూ శాంసన్ (12) నిలకడగా ఆడుతున్నాడు. మరో ఎండ్లో శివమ్ దూబే (4) ఉన్నాడు. పవర్ప్లే ఆఖరికి రాజస్థాన్ 3 వికెట్లకు 32 పరుగులు చేసింది.