సుయాజ్ కాలువలో..
తాజాగా ట్విటర్లో జేమ్స్ నీషమ్ను ఓ ఐపీఎల్ అభిమాని ఒక ప్రశ్న అడిగాడు. 'నీషమ్.. ఐపీఎల్ త్వరలో ప్రారంభమవుతుంది. ముంబై జట్టుతో ఎప్పుడు కలుస్తావ్' అని ప్రశ్నించాడు. దీనికి నీషమ్ రిప్లై ఇచ్చాడు. 'నేను ఐపీఎల్ 2021 ఆడేందుకు వస్తున్నా. కానీ కార్గో షిప్ వల్ల ఇప్పుడు సుయాజ్ కాలువలో చిక్కుకుపోయా. త్వరలోనే బయటపడుతా' అంటూ అభిమానికి ఫన్నీ రిప్లై ఇచ్చాడు నీషమ్. నీషమ్ ఇచ్చిన సమాధానానికి గ్లెన్ మ్యాక్స్వెల్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు.
మ్యాక్సీ సెటైర్స్..
'జేమ్స్ నీషమ్.. 46, 44, 46 ఈ బరువులు నీ బ్యాగ్లో మోస్తూనే ఉన్నావా. అందుకే చిక్కుకుపోయావు' అంటూ జేమ్స్ నీషమ్కు గ్లెన్ మ్యాక్స్వెల్ కౌంటర్ ఇచ్చాడు. అయితే మ్యాక్స్వెల్ పెట్టిన కామెంట్ ఎవరికీ అర్థం కాలేదు. అసలు కారణం ఏంటంటే.. ఇటీవల కివీస్, ఆసీస్ మధ్య జరిగిన ఐదు టీ20 సిరీస్లో భాగంగా మూడో టీ20లో మ్యాక్సీ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ మ్యాచ్లో 70 పరుగులు చేసిన మ్యాక్స్వెల్.. నీషమ్ను ఉతికారేశాడు. నీషమ్ వేసిన ఒకే ఓవర్లో వరుసగా 4,6,4,4,4,6 బాది మొత్తంగా 28 పరుగులు పిండుకున్నాడు. అదే అర్ధం వచ్చేలా మ్యాక్సీ ట్వీట్ చేశాడు.

రూ.14.25 కోట్ల భారీ ధరకు..
గతేడాది పంజాబ్ కింగ్స్ తరపున మ్యాక్సీ ఘోరంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్లాడిన అతను 108 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరచడంతో పంజాబ్ జట్టు అతన్ని రిలీజ్ చేసింది. అయితే మ్యాక్స్వెల్ బిగ్బాష్ లీగ్తో పాటు అంతర్జాతీయ టీ20ల్లో దుమ్మురేపే ప్రదర్శన చేయడంతో.. ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో రూ. 14.25 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. మరి ఈసారి ఎలా ఆడుతాడో చూడాలి. ఇక నీషమ్ గతేడాది ఎక్కువగా మ్యాచులు ఆడలేదు.

రెండు నెలలు పండుగే..
ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 మ్యాచ్లు జరగనున్న విషయం తెలిసిందే. ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ మ్యాచ్లకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. టోర్నీ మొదటి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్ ఢీ కొట్టబోతోంది. ఒక్క మ్యాచ్ కూడా తన సొంత మైదానంలో ఆడే అవకాశం ఏ జట్లకూ లేదు. టోర్నీలో మ్యాచ్ల్నీ అన్ని జట్లూ తటస్థ వేదికల్లోనే ఆడనున్నాయి.


Click it and Unblock the Notifications












