
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఏ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. ఇప్పటిదాకా ఆడిన రెండు మ్యాచుల్లోనూ పరాజయాన్ని చవి చూసింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. రెండోసారి బ్యాటింగ్ చేసిన డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్రైజర్స్.. విజయం వాకిట బోల్తా కొడుతూ వస్తోంది. ఏడెనిమిది పరుగుల తేడాతో మ్యాచ్ను ప్రత్యర్థికి జారవిడుచుకుంటోంది. ఈ పరిస్థితుల మధ్య ఆ టీమ్ శనివారం తన మూడో మ్యాచ్ ఆడబోతోంది. బలమైన ముంబై ఇండియన్స్ జట్టును ఢీ కొట్టబోతోంది. సాయంత్రం 7:30 గంటలకు చెన్నై చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.
ఇది రంజాన్ మాసం. మంగళవారం నెలవంక కనిపించడంతో రంజాన్ నెల ఆరంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో రంజాన్ కఠోర దీక్షను చేపట్టారు. వచ్చేనెల 13వ తేదీన రంజాన్ పండుగతో దీక్షను విరమిస్తారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న టాప్ క్లాస్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సైతం రంజాన్ మాసాన్ని జరుపుకొంటున్నాడు. ప్రస్తుతం అతను జట్టుతో పాటు చెన్నైలో ఉంటున్నాడు. నెట్ ప్రాక్టీస్లో పాల్గొంటున్నాడు. పవిత్ర రంజాన్ నెల సందర్భంగా అతను తన తల్లిని స్మరించుకున్నాడు. తల్లి తోడుగా లేకుండా తొలి రంజాన్ పండుగను జరుపుకోవాల్సి వస్తోందని పేర్కొన్నాడు.
తల్లి సమాధి వద్ద నమాజ్ చేస్తోన్న ఓ ఫొటోను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. తన జీవితానికి సరిపడేంతటి విలువలను తల్లి తనకు నేర్పించిందని చెప్పాడు. ఆమె లేకుండా జీవించడం ఎలాగో నేర్పించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన మెదడు ఇప్పటికీ ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నిస్తోందని, ఆమె కోసం తన గుండె ఎదురు చూస్తోందని ఉద్విగ్నంగా చెప్పాడు. తల్లి ఇక తిరిగి రాదనే విషయం తన ఆత్మకు తెలుసునని పేర్కొన్నాడు. తన వరకు ఈ ప్రపంచంలో తల్లిని మించిన ట్రెజరీ లేదని అన్నాడు. రషీద్ ఖాన్ తల్లి గత ఏడాది జూన్లో కన్నుమూశారు.