
ముంబై: వచ్చేనెల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆరంభం కాబోతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సెకెండ్ ఫేస్లో కొన్ని కొత్త ముఖాలు కనిపించబోతోన్నాయి. ఇప్పటిదాకా ఐపీఎల్ ఆడని ఒకరిద్దరు ప్లేయర్లతో పాటు పునరాగమనం చేసిన ఆటగాళ్లు క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించడానికి సమాయాత్తమౌతోన్నారు. ఈ సారి ఐపీఎల్ 2021 టైటిల్ హాట్ ఫేవరెట్గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సహా రాజస్థాన్ రాయల్స్.. ఒక్కొక్కరు చొప్పున విదేశీ ఆటగాళ్లతో కాంట్రాక్టులను కుదుర్చుకున్నాయి.
ప్రపంచ నంబర్ వన్ టీ20 బౌలర్ తబ్రేజ్ శాంసీ ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేస్లో ఆడబోతోన్నాడు. రాజస్థాన్ రాయల్స్లో చేరాడతను. శాంసీతో తాము కాంట్రాక్ట్ కుదుర్చుకున్న విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ కొద్దిసేపటి కిందటే అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. దక్షిణాప్రికా బౌలర్ తబ్రేజ్ శాంసీ. టీ20 మ్యాచ్ల స్పెషలిస్ట్ బౌలర్. టీ20 మ్యాచ్లల్లో వరల్డ్ నంబర్గా కొనసాగుతున్నాడతను.
వ్యక్తిగత కారణాల వల్ల సెకెండ్ ఫేస్ ఐపీఎల్ మ్యాచ్ల నుంచి తప్పుకొన్న ఆండ్రూ టై స్థానంలో శాంసీని తీసుకుంది రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ. ఇప్పటిదాకా 31 టీ20 మ్యాచ్లను ఆడిన శాంసీ 45 వికెట్లను పడగొట్టాడు. 27 వన్డే ఇంటర్నేషనల్స్లో 32 వికెట్లు తీసుకున్నాడు. 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్ టోర్నమెంట్లో ఆడాడు. మూడు వికెట్లను మాత్రమే తన ఖాతాలో వేసుకోగలిగాడు.
మరోవంక- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా విదేశీ ఆటగాడిని జట్టులోకి తీసుకుంది. ఆ ఆటగాడు ఇంగ్లాండ్ ఆల్రౌండర్ జార్జ్ గార్టన్ను టీమ్లోకి తీసుకుంది. జార్జ్ గార్టన్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్. కౌంటీల్లో సస్సెక్స్ తరఫున ఆడుతున్నాడతను. దీనితో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్లో కూడా ఓ కొత్త ముఖం వచ్చి చేరినట్టయింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీలో ఏబీ డివిలియర్స్, మహ్మద్ సిరాజ్, జెమిసన్, క్రిస్టియన్, వనిందు హసరంగ, దేవ్దత్ పడిక్కల్, గ్లెన్ మ్యాక్స్వెల్, టిమ్ డేవిడ్, జార్జ్ గార్టన్, చమీర, కేఎస్ భరత్, సుయాష్, అజరుద్దీన్, రజత్ పాటిదార్, నవ్దీప్ షైనీ, హర్షల్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఎస్ బేబి, దేశ్పాండే, ఎస్ అహ్మద్ ఉన్నారు.