
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్..14వ ఎడిషన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇదివరకెప్పుడూ లేనివిధంగా అద్భుతంగా రాణిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని రంగాల్లోనూ ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యాన్ని చలాయిస్తోంది కోహ్లీసేన. ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఘన విజయాన్ని అందుకుంది. ఓటమి అనేదే లేకుండా టోర్నమెంట్లో దూసుకెళ్తోంది. ప్రత్యేకించి గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్పై కళ్లు చెదిరే విజయాన్ని సాధించింది. రాజస్థాన్ రాయల్స్పై నమోదు చేసిన విజయం..ఈ సారి కప్ గెలిచి తీరాలనే బెంగళూరు జట్టును పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయాల్లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కీ రోల్ పోషిస్తున్నాడు. గురువారం రాత్రి నాటి మ్యాచ్లో కూడా అతను మూడు వికెట్లను పడగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 27 పరుగులు ఇచ్చి.. ఓపెనర్ జోస్ బట్లర్, మిడిలార్డర్ బ్యాట్స్మెన్లు డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియాలను పెవిలియన్ దారి పట్టించాడు. ఈ సీజన్లో సిరాజ్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 3/27గా ఈ మ్యాచ్లో రికార్డయింది. ఇదే మ్యాచ్లో హర్షల్ పటేల్ కూడా మూడు వికెట్లతో రాణించాడు. నాలుగు ఓవర్లలో 47 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడతను.
ఈ సీజన్లో ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచుల్లో మహ్మద్ సిరాజ్ అయిదు వికెట్లు తీసుకున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్పై రెండు వికెట్లు అతని ఖాతాలో ఉన్నాయి. వికెట్ల సంఖ్య తక్కువే అయినప్పటికీ- పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇప్పటిదాకా ఈ ఐపీఎల్ సీజన్లో 84 బంతులను ప్రత్యర్థి బ్యాట్స్మెన్లకు సంధించగా.. అందులో 50 డాట్ బాల్స్ ఉన్నాయి. ఈ 50 బంతులకు గాను ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు సిరాజ్. ఇదో అరుదైన రికార్డు. ఈ సీజన్లో ఇప్పటిదాకా ఏ బౌలర్కు కూడా సాధ్యం కాలేదా ఫీట్. ఒక్క రన్ కూడా ఇవ్వకుండా 50 బంతులను విసిరిన తొలి బౌలర్గా తన పేరును లిఖించుకున్నాడు.