
అబుదాబి: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో బుధవారం అబుదాబి వేదికగా చివరి బంతివరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచులో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అద్భుత విజయాన్ని అందుకుంది. ఎస్ఆర్హెచ్ నిర్ధేశించిన 142 లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 136 పరుగులే చేసింది. దేవ్దత్ పడిక్కల్ (41; 52 బంతుల్లో 4×4), గ్లెన్ మాక్స్వెల్ (40; 25 బంతుల్లో 3×4, 2x6) రాణించినప్పటికీ.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ (19 నాటౌట్; 13 బంతుల్లో 1×4, 1×6) చివరి వరకు క్రీజులో ఉన్నా ఫలితం లేకుండా పోయింది. భువనేశ్వర్ కుమార్ అద్భుత బౌలింగ్ కారణంగా 4 పరుగుల తేడాతో ఆర్సీబీని ఎస్ఆర్హెచ్ ఓడించింది. కీలక సమయంలో హైదరాబాద్ బౌలర్లు తలో వికెట్ తీసి జట్టు విజయంలో పాలు పంచుకున్నారు.
ఈ మ్యాచులో టర్నింగ్ పాయింట్ అంటే.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ చేసిన రన్ ఔట్ అనే చెప్పాలి. మ్యాచ్లో ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్లో దేవదత్ పడిక్కల్ బంతిని కవర్స్ దిశగా బాదాడు. ఆపై సింగిల్ కోసం గ్లెన్ మాక్స్వెల్ని పిలిచాడు. అయితే అక్కడే విలియమ్సన్ ఉండటంతో తొలుత కాస్త తటపటాయించిన మాక్స్వెల్.. అనంతరం పరుగు తీసేందుకు వెళ్లిపోయాడు. అప్పటికే బంతిని అందుకున్న విలియమ్సన్.. పక్కకి డైవ్ చేస్తూ స్టంప్స్పైకి విసిరాడు. దాంతో మాక్స్వెల్ క్రీజుకి చాలా దూరంగా ఉండగానే.. బంతి వికెట్లను గిరాటేసింది. అప్పటికి బెంగళూరు విజయానికి 36 బంతుల్లో 50 పరుగులు చేయాల్సి ఉంది.
గ్లెన్ మాక్స్వెల్ని కేన్ విలియమ్సన్ రనౌట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇక రషీద్ ఖాన్ తన చివరి ఓవర్లో దేవదత్ పడిక్కల్ను పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో షాబాజ్ అహ్మద్ (14; 9 బంతుల్లో 2×4), ఏబీ డివిలియర్స్ (19 నాటౌట్; 13 బంతుల్లో 1×4, 1×6) జట్టును విజయానికి చేరువ చేశారు. అయితే 12 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన స్థితిలో జాసన్ హోల్డర్ 19వ ఓవర్లో షాబాజ్ను ఔట్ చేయడమే కాక.. 5 పరుగులే ఇచ్చి ఆర్సీబీని తీవ్ర ఒత్తిడిలో పడేశాడు. ఇక చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. తొలి 3 బంతుల్లో భువనేశ్వర్ కుమార్ ఒక్క పరుగే ఇచ్చాడు. నాలుగో బంతికి ఏబీ సిక్స్ బాదడంతో తీవ్ర ఉత్కంఠ రేగింది. కానీ తర్వాతి రెండు బంతులకు ఏబీ షాట్లు ఆడలేకపోవడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.
మొత్తంగా గ్లెన్ మాక్స్వెల్ రనౌట్ మ్యాచ్లో కీలక మలుపు అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ అంగీకరించాడు. 'ఈ మ్యాచులో గ్లెన్ మాక్స్వెల్ రనౌట్ కావడమే టర్నింగ్ పాయింట్గా మారింది. మరోవైపు ఏబీ డివిలియర్స్ క్రీజులో ఉన్నంతవరకూ మేం పోటీలో ఉన్నామనే అనుకున్నాం. తొలుత బౌలింగ్లో బాగా రాణించినా.. బ్యాటింగ్లోనే సరైన ప్రదర్శన చేయలేకపోయాం. ఈ క్రమంలోనే చివర్లో షాబాజ్ అహ్మద్ (14) విలువైన పరుగులు చేశాడు. ఇది స్వల్ప స్కోర్ల మ్యాచ్ అయినా సన్రైజర్స్ హైదరాబాద్ చివరిబంతి వరకూ పోరాడింది' అని కోహ్లీ చెప్పాడు.