
ముంబై: వాంఖడే స్టేడియం వేదికగా మరికాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపీఎల్ 2021 రెండో లీగ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. నలుగురు విదేశీ ఆటగాళ్ల కోటాలో స్టాయినీస్, హెట్మైర్, టామ్ కరన్, క్రిస్ వోక్స్ ఆడుతున్నారు. కరన్, వోక్స్ ఈ మ్యాచ్ ద్వారా ఢిల్లీ తరఫున అరంగేట్రం చేస్తున్నారు. ఇక చెన్నై తరఫున ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్ అలీ, సామ్ కరన్ మరియు డ్వేన్ బ్రావో తుది జట్టులో ఉన్నారు. చెన్నై భారీ ధరకు కొనుగోలు చేసిన కృష్ణప్ప గౌతమ్ మ్యాచ్ ఆడడం లేదు.
చెన్నైకి ఎంఎస్ ధోనీ.. ఢిల్లీకి రిషబ్ పంత్ సారథులుగా ఉన్నారు. 'మహీ భాయ్ నాకు గురువుతో సమానం' అని గతంలో చెప్పిన పంత్.. ఇప్పుడు ప్రత్యర్థి సారథిగా అతడినే ఢీకొననున్నాడు. మరికాసేపట్లో గురు, శిష్యుల పోరు ప్రారంభంకానుంది. ఐపీఎల్లో తొలిసారి కెప్టెన్లుగా తలపడుతున్న వీరి పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ శస్త్రచికిత్స కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరం కాగా.. పంత్ ఢిల్లీని ముందుకు నడిపించనున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ , చెన్నై జట్ల మధ్య ఆసక్తికరమైన పోరాటాలు జరిగాయి. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 23 సార్లు తలపడ్డాయి. వీటిలో 15 విజయాలతో ధోనీసేనదే పైచేయి. మరోవైపు ఢిల్లీ 8 గెలిచింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. కాగా చివరి ఐదు మ్యాచులు మాత్రం హోరాహోరీగా సాగాయి. 2020లో రెండు మ్యాచుల్లోనూ ఢిల్లీ విజయ దుందుభి మోగించింది. 2019లో పూర్తిగా ధోనీసేనదే ఆధిపత్యం. రెండు లీగు మ్యాచులు, రెండో క్వాలిఫయర్లో ఢిల్లీని చిత్తు చేసింది. మరి ఈరోజు ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.
తుది జట్లు:
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, ఫాఫ్ డుప్లెసిస్, సురేశ్ రైనా, ఎంఎస్ ధోనీ, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, సామ్ కరన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్.
ఢిల్లీ: శిఖర్ ధావన్, పృథ్వీ షా, అజింక్య రహానే, రిషబ్ పంత్, మార్కస్ స్టొయినిస్, శిమ్రాన్ హెట్మైయిర్, క్రిస్ వోక్స్, రవిచంద్రన్ అశ్విన్, టామ్ కరన్, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్.