ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021, 14వ ఎడిషన్ టైటిల్ హాట్ ఫేవరెట్గా బరిలో దిగిన ఢిల్లీ కేపిటల్స్.. అందుకు తగినట్టుగా రాణిస్తోంది. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఊది అవతల పారేసింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన రెండో మ్యాచ్లో బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ.. బౌలింగ్ విభాగంలో అద్భుతంగా రాణించింది. రాజస్థాన్ రాయల్స్ను దాదాపు ఓడించినంత పని చేసింది. చేసింది 147 పరుగులే అయినప్పటికీ..మ్యాచ్పై పట్టు బిగించే అవకాశం ప్రత్యర్థికి ఏ మాత్రం ఇవ్వలేదు. చివరి ఓవర్ వరకూ మ్యాచ్ను లాక్కెళ్లగలిగింది.
అలాంటి ఢిల్లీ కేపిటల్స్ బౌలింగ్ విభాగం కొంత బలహీన పడటానికి అవకాశం ఏర్పడింది. ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ మళ్లీ గాయాల బారిన పడటమే దీనికి కారణం. ఇషాంత్ శర్మ మడమల్లో గాయంతో బాధపడుతున్నాడు. ఆ కారణంతోనే తొలి రెండు మ్యాచ్లల్లో ఆడలేకపోయాడు. తదుపరి మ్యాచ్కు అందుబాటులో ఉంటాడనేది అనుమానమే. ఇషాంత్ శర్మ గాయపడిన విషయాన్ని ఢిల్లీ కేపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ నిర్ధారించాడు. రికవరీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నామని చెప్పాడు.
ఇషాంత్ శర్మ గాయపడటం వల్ల తుది జట్టులో చోటు దక్కించుకున్న అవేష్ ఖాన్ అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోవడం పట్ల రికీ పాంటింగ్ స్పందించాడు. చివరి ఓవర్లలో క్రిస్ మోరిస్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడని, అతన్ని కట్టడి చేయడంలో బౌలర్లు విఫలం అయ్యారని పేర్కొన్నాడు. మోరిస్పై ఒత్తిడిని తీసుకుని రాలేకపోయామని, తమ ఓటమికి అదే కారణమైందని అన్నాడు.
ప్రత్యేకించి- చివరి ఓవర్లో అతనికి సంధించిన రెండు బంతులు.. తమ జట్టుకు విజయాన్ని దూరం చేశాయని తేల్చేశాడు. ఇషాంత్ స్థానాన్ని అవేష్ ఖాన్ పూర్తి స్థాయిలో భర్తీ చేస్తాడని భావిస్తున్నట్లు చెప్పాడు. ఇషాంత్ అనుభవం జట్టుకు అవసరమొస్తుందని అభిప్రాయపడ్డాడు. క్రిస్ వోక్స్, కగిసో రబడ, నోర్ట్జే, టామ్ కుర్రన్లతో బౌలింగ్ విభాగం బలంగా ఉందని, రవిచంద్రన్ అశ్విన్ రూపంలో నాణ్యమైన స్పిన్నర్ జట్టులో ఉన్నాడని చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో ఇషాంత్ శర్మ అనుభవం ఉపయోగపడుతుందని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు రికీ పాంటింగ్ స్పష్టం చేశాడు.