
అత్తెసరు స్కోర్లే..
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్.. ఢిల్లీ కేపిటల్స్ బౌలర్ల ధాటికి ఏ మాత్రం ఎదురు నిలవలేకపోయింది. రబడ, ఎన్రిచ్ నోర్ట్జె బౌలింగ్ ధాటికి కుప్పకూలింది. నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులకే చాప చుట్టేసింది. తొలి ఓవర్లోనే డేవిడ్ వార్నర్ వికెట్ను కోల్పోయిన తరువాత.. ఏ మాత్రం బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గాడిన పడలేకపోయింది. ఒకరి తరువాత ఒకరుగా మిగిలిన బ్యాట్స్మెన్లు పెవిలియన్ దారి పట్టారు. చివర్లో అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్ కొంత ప్రతిఘటించడంతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది.

తక్కువ స్కోర్ను ఊదేసిన ఢిల్లీ
ఛేదించాల్సిన లక్ష్యంతో పరిమితంగా ఉండటంతో ఢిల్లీ కేపిటల్స్ ఏ మాత్రం బెరుకు లేకుండా ఆడింది. తొలి ఓవర్లలోనే పృథ్వీ షా వికెట్ను కోల్పోయినప్పటికీ పెద్దగా టెన్షన్ పడలేదు. దూకుడుగా ఆడింది. మరో ఓపెనర్ శిఖర్ ధవన్ చాన్నాళ్ల తరువాత జోరు ప్రదర్శించాడు. 37 బంతుల్లో ఒక సిక్సర్ నాలుగు ఫోర్లతో 42 పరుగులు చేశాడు. రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక మరో వికెట్ను కోల్పోలేదు ఢిల్లీ, మాజీ కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ప్రజెంట్ కేప్టెన్ రిషభ్ పంత్.. భారీ షాట్లతో స్కోర్ బోర్డ్ను పరుగులు పెట్టించారు. వారిద్దరూ నాటౌట్గా నిలిచారు.

గ్రేట్ కమ్బ్యాక్
సుదీర్ఘ విరామం అనంతరం శ్రేయాస్ అయ్యర్ గ్రౌండ్లో కనిపించాడు. తన బ్యాటింగ్ ఛరిష్మా తగ్గలేదని నిరూపించుకున్నాడు. భుజానికి గాయం కావడం వల్ల అతను కొన్ని నెలల పాటు క్రికెట్కు దూరం అయ్యాడు. శిఖర్ ధవన్ సారథ్యంలో శ్రీలంకలో పర్యటించిన వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 సిరీస్లోనూ అతను ఆడలేదు. భుజం నొప్పి నుంచి తేరుకున్న తరువాత నెట్స్లో కష్టపడ్డాడు. తన బ్యాటింగ్ శైలిని మళ్లీ పట్టాలెక్కించాడు. అతని శ్రమ వృధా కాలేదు. 41 బంతుల్లో 47 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇందులో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.

కేప్టెన్సీని కోల్పోవడం పట్ల
ఇదివరకు శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీ కేపిటల్స్కు సారథ్యాన్ని వహించిన విషయం తెలిసిందే. అతని స్థానంలో రిషభ్ పంత్ అపాయింట్ అయ్యాడు. సెకెండ్ హాఫ్ మ్యాచ్లకు అయ్యర్ జట్టులో చేరినప్పటికీ.. మేనేజ్మెంట్ మాత్రం నాయకత్వంలో మార్పులు చేయలేదు. రిషభ్ను తొలగించి- ఎప్పట్లా అయ్యర్కు ఆ బాధ్యతలను అప్పగించలేదు. దీనిపై అయ్యర్ వ్యవహార శైలి ఎలా ఉండొచ్చనే అనుమానాలు మొదట్లో తలెత్తాయి. దాన్ని పటాపంచలు చేశాడతను.

పంత్ కేప్టెన్సీలో హ్యాపీగా..
రిషభ్ పంత్ కేప్టెన్సీ పట్ల తాను సంతోషంగా ఉన్నానని అయ్యర్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. కేప్టెన్సీ విషయంలో పంత్తో తనకు విభేదాలు తలెత్తాయంటూ వచ్చిన వార్తలను కొట్టిపారేశాడు. అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పాడు. టీమ్ ఫ్రాంఛైజీ కేప్టెన్గా నియమించినప్పుడు తనకంటూ కొన్ని నిర్ణయాలు ఉండేవని, నిర్ణయాలను తీసుకోవడంలో దూకుడును ప్రదర్శించానని, అది రెండు సీజన్లలో జట్టు రాణించడానికి సహాయపడిందని అన్నాడు. పంత్ను కేప్టెన్ను చేయాలంటూ ఫ్రాంఛైజీ తీసుకున్న నిర్ణయాన్ని ది బెస్ట్గా అభివర్ణించాడు అయ్యర్. ఆ నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని చెప్పాడు.

బ్యాటింగ్పై ఫోకస్..
కేప్టెన్సీ నుంచి తప్పించడంతో ఒత్తిడి తొలగిపోయినట్టయిందని అయ్యర్ పేర్కొన్నాడు. ఇక తాను బ్యాటింగ్పై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తానని అన్నాడు. బ్యాటింగ్లో మరింత రెచ్చిపోవడానికి ఇది సహకరిస్తుందని, స్వేచ్ఛగా ఆడతానని చెప్పాడు. కమ్ బ్యాక్ మ్యాచ్లో 42 పరుగులు చేయడం తనకు సంతోషాన్ని ఇస్తోందని, అలాగే జట్టు విజయం సాధించడం, ప్లేఆఫ్కు మరింత చేరువ కావడం, పాయింట్ల పట్టికలో టాప్ పొజీషన్లో ఉండటం ఇవన్నీ ఆనందాన్ని ఇచ్చే విషయాలేనని అయ్యర్ వ్యాఖ్యానించాడు.


Click it and Unblock the Notifications
