ఎవరూ భయపడలేదు:
తాజాగా దీపక్ చహర్ స్టార్ స్పోర్ట్స్ ఛానెల్తో మాట్లాడుతూ... 'చెన్నై బృందంలో కొందరికి కరోనా పాజిటివ్ రాగానే జట్టు యాజమాన్యం మమ్మల్ని ఐసోలేషన్లోకి వెళ్లమని చెప్పింది. ప్రతిరోజూ మాకు వైరస్ టెస్టులు జరిగేవి. దాంతో మిగిలిన అందరికీ నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. అదో పెద్ద ఉపశమనం. పలు కేసులు నమోదైనా మా జట్టులో ఎవరూ భయపడలేదు. అందరూ బాగా సమన్వయం చేసుకున్నారు. జట్టులో ఎవరూ నిబంధనలు అతిక్రమించలేదు. ప్రతి ఒక్కరూ కచ్చితమైన నియమాలు పాటించారు. అయినా ఎక్కడ తప్పు జరిగిందో తెలియట్లేదు' అని అన్నాడు.
కరోనా ఎక్కడి నుంచి సోకిందో:
'ప్రతి జట్టులోని ఆటగాళ్లందరూ బయో బుడగను ఖచ్చితంగా పాటించారు. ఎవరూ నిబంధనలు అతిక్రమించలేదు. ఒక నగరం నుంచి ఇంకో నగరానికి బయో బబుల్ మార్చడం అనేది కష్టతరమైన పని. అయితే అదసలు ఎలా అంటుకుందనే విషయం నాకు తెలియదు. ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కరోనా ఎక్కడి నుంచి సోకిందో చెప్పడం కష్టమే' అని చెన్నై పేసర్ దీపక్ చహర్ తెలిపాడు. గత సీజన్లో తేలిపోయిన చహర్.. ఐపీఎల్ 2021లో అద్భుతంగా రాణించాడు. ఆడిన ఏడు మ్యాచుల్లో 8 వికెట్లు పడగొట్టాడు. పవర్ ప్లే, డెత్ ఓవర్లలో పరుగులు కట్టడి చేస్తూ చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
కరోనా బారిన చహర్:
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, మైఖేల్ హస్సీతో పాటు మరో ఇద్దరు దిగువ స్థాయి సిబ్బంది సైతం వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలోనే మెరుగైన వైద్యం కోసం బాలాజీ, హస్సీని ఎయిర్ అంబులెన్స్లో చెన్నైకు తరలించారు. మరోవైపు గతేడాది యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్ 13వ సీజన్కు ముందు సైతం దీపక్ చహర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తర్వాత అతడు కోలుకొని మ్యాచ్లు ఆడాడు. అయితే ఆశించిన మేర మాత్రం రాణించలేదు.
కరోనా ఎలా వచ్చిందో ఆశ్చర్యంగా ఉంది:
తాజాగా ఓ జాతీయ మీడియాతో ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ... 'అందరం బయో బబుల్లోనే ఉన్నాం. టీమ్లోని నిబంధనల్ని తూచ తప్పకుండా పాటించాం. బయటివారితో పరిచయం ఏర్పడే అవకాశం లేదు. మమల్ని కచ్చితమైన ప్రోటోకాల్స్ పాటించేలా చేశారు. గదిలోనే ఉండాలి, వ్యక్తిగతంగా ఎవరిని సంప్రదించకూడదు. హ్యాండ్ వాష్, మాస్కులు ఎప్పుడూ దరించాం. కోచ్లు, మేనేజ్మెంట్తో భోజనం చేసేటప్పుడు లేదా మాట్లాడుతున్నప్పుడు కూడా మాస్క్లు పెట్టుకునే ఉన్నాం. అయినా టీమ్లో కరోనా పాజిటివ్ కేసు నమోదవడం నన్ను ఆశ్చర్యపరిచింది' అని అన్నాడు.