ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇప్పటివరకు టైటిల్ సాధించని జట్లలో పంజాబ్ కింగ్స్ కూడా ఒకటి. పంజాబ్ జట్టుకు కెప్టెన్లు, కోచ్లు ఎంతమంది మారినా.. విజేతగా మాత్రం నిలవలేకపోతోంది. ప్రతిసారి ఏదో ఒక కారణం (బ్యాటింగ్, బౌలింగ్)తో టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. అయితే ఆర్ అశ్విన్ నుంచి పగ్గాలు అందుకున్న కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. గత మూడు సీజన్లలో టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలుస్తూ తన జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. ఐపీఎల్ 2021లోనూ రాజస్థాన్పై 91 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈసారైనా పంజాబ్ విజేతగా నిలవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. నేడు పంజాబ్ కెప్టెన్ రాహుల్ పుట్టిన రోజు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆదివారం తన 29వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా వేలమంది అభిమానులు అతనికి విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో తన గర్ల్ఫ్రెండ్, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి కూడా విషెస్ చెప్పారు. ఆ విషెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'ఈ ఏడాది గొప్పగా సాగాలని కోరుకుంటున్నా. జన్మదిన శుభాకంక్షాలు' అని ట్వీట్ చేశారు. రాహుల్కు విషెస్ చెబుతూ.. అతనితో దిగిన ఫొటోలను ఆమె ఇన్స్టాలో షేర్ చేశారు.
ఈ ట్వీట్పై అతియా శెట్టి తండ్రి, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా స్పందించడం విశేషం. 'గ్రేట్ఫుల్ ఫర్ యు, హ్యాపీ బర్త్ డే' అని అతియా చేసిన పోస్ట్పై స్పందిస్తూ.. నిజంగానే అంటూ ఓ బ్లాక్ కలర్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేశాడు. 'మై క్యూటీస్' అంటూ క్రికెటర్ హార్దిక్ పాండ్యా కూడా అతియా పోస్ట్పై కామెంట్ చేశాడు. ప్రస్తుతం అతియా చేసిన ట్వీట్, ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. రాహుల్తో దిగిన ఈ ఫొటోలు అతియా ఎప్పుడూ బయటపెట్టలేదు.
కేఎల్ రాహుల్, అతియా శెట్టి ఇద్దరూ ఒకరి బర్త్డేలకు ఒకరు విషెస్ చెప్పుకోవడమే తప్ప ఇప్పటి వరకూ తమ రిలేషన్షిప్పై బయటపడలేదు. అప్పుడప్పుడూ డిన్నర్, పార్టీలు అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తమ ప్రేమ విషయంపై మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. అయితే అతియా తండ్రి సునీల్ శెట్టి మాత్రం ఇప్పటికే వీళ్లకు గ్రీన్సిగ్నల్ ఇచ్చేశాడు. గతేడాది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు, తన భార్య మనా శెట్టికి తమ పిల్లలు, వాళ్లు డేటింగ్ చేసిన వాళ్లంటే ఇష్టమని చెప్పాడు.
2013లో ఐపీఎల్లో బెంగళూరు తరఫున అరంగేట్రం చేసిన కేఎల్ రాహుల్ తొలి మూడు సీజన్లలో ఆకట్టుకోలేకపోయాడు. 2013లో బెంగళూరు తరఫున 5 మ్యాచ్లాడి 20 పరుగులే చేశాడు. 2014లో సన్రైజర్స్ హైదరాబాద్ రూ. కోటి వెచ్చించి కొనుగోలు చేయగా.. రెండు సీజన్ల పాటు ఆడాడు. వరుసగా 166, 142 పరుగులు చేసి విఫలమవడంతో.. 2016లో మళ్లీ బెంగళూరుకి చేరాడు. ఈసారి 397 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే 2017లో గాయం కారణంగా ఆ సీజన్లో ఆడలేకపోయాడు. 2018లో పంజాబ్ కింగ్స్ రాహుల్ను రూ.11 కోట్లకు కొనుగోలు చేసింది. అక్కడి నుంచే అతడి దశ తిరిగింది.