చెన్నై: చెన్నైలోని చెపాక్ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచులో పటిష్ట ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 రన్స్ చేసి.. ఢిల్లీ ముందు 138 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ సీనియర్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా తన స్పిన్ మాయాజాలంతో నాలుగు వికెట్ పడగొట్టి ముంబై టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ను బెంబేలెత్తించాడు. పేసర్ అవేశ్ ఖాన్ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (44, 30 బంతుల్లో 3x4, 3x 6) చెలరేగగా.. ఇషాన్ కిషన్ (26, 28 బంతుల్లో 1x4, 1x 6), జయంత్ యాదవ్ (23, 22 బంతుల్లో 1x4) ఆదుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ (24) రెండంకెల స్కోరు చేశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. మార్కస్ స్టాయినీస్ వేసిన మూడో ఓవర్ మొదటి బంతికే స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (1) ఔట్ అయ్యాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అతడు వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులో ఉన్న మరో ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్ జోరుగా బ్యాటింగ్ చేశారు. స్పిన్నర్ ఆర్ అశ్విన్ వేసిన నాలుగో ఓవర్లో సూర్య ఒక ఫోర్ బాదగా.. రోహిత్ 4, 6 కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. ఆపై కాగిసో రబాడ బౌలింగ్లోనూ 14 రన్స్ రాబట్టారు. దీంతో పవర్ప్లే ముగిసేసరికి ముంబై ఒక వికెట్ నష్టానికి 55 రన్స్ చేసింది.
రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతుండటంతో ముంబై భారీ స్కోరు చేసేలా కనిపించింది. ఈ సమయంలో బౌలింగ్కు దిగిన వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మణికట్టు మాయాజాలాన్ని ప్రదర్శించాడు. 9వ ఓవర్లో రోహిత్, హార్దిక్ పాండ్యా (0)ను ఔట్ చేశాడు. కృనాల్ పాండ్యా (1), కీరన్ పొలార్డ్ (2) విఫలమయ్యారు. దీంతో ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో జయంత్, ఇషాన్ ముంబైని ఆదుకునే ప్రయత్నం చేశారు. చివర్లో నిలకడగా ఆడుతున్న ఇషాన్ను మిశ్రా పెవిలియన్ పంపడంతో కనీసం ముంబై 150 మార్క్ కూడా అందుకోలేకపోయింది. ఢిల్లీ స్పిన్నర్లు టాప్, మిడిలార్డర్ బ్యాట్స్మెన్ ఆటకట్టించారు. మిశ్రా దెబ్బకు మెరుపులు లేకుండానే ముంబై ఇన్నింగ్స్ ముగిసింది.
IPL 2021: ఎంఎస్ ధోనీ మరో 2-3 ఏళ్లు ఆడతాడు.. ఇక మహీ వారసుడు అతడే! రైనా మాత్రం కాదు!