
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్లో భాగంగా ఈ సాయంత్రం మరో హైఓల్టేజ్ మ్యాచ్ మొదలు కానుంది. టైటిల్ పోరులో టాప్ ప్లేస్లో ఉంటోన్న ముంబై ఇండియన్స..ఢిల్లీ కేపిటల్స్ తలపడబోతున్నాయి. చెన్నై చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. రెండు జట్లూ సమవుజ్జీగా ఉన్నాయి. గత ఏడాది ఐపీఎల్ ఫైనల్లో ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీగా పోరు సాగిన విషయం తెలిసిందే. ఇందులో ముంబై ఇండియన్స్దే పైచేయి అయింది.
ముంబై ఇండియన్స్తో మ్యాచ్ ఆరంభం కావడానికి కొన్ని గంటల ముందు ఢిల్లీ కేపిటల్స్కు తీపి కబురు అందింది. గాయంతో జట్టుకు దూరమైన స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ ఫిట్నెస్ సాధించాడు. ఇషాంత్ పూర్తి ఫిట్తో ఉన్నాడని జట్టు మేనేజ్మెంట్ వెల్లడించింది. ముంబైతో మ్యాచ్ ఆడటానికి రెడీగా ఉన్నాడని తెలిపింది. మడమల్లో గాయం కారణంగా ఇషాంత్ శర్మ జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడది నయమైందని జట్టు మేనేజ్మెంట్ ధృవీకరించింది.
డెత్ ఓవర్లలో అనుభవజ్ఞుడైన బౌలర్ కొరతను ఎదుర్కోంటోంది ఢిల్లీ కేపిటల్స్. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్ దూకుడు ముందు కొత్త బౌలర్లు కాస్త ఒత్తిడికి లోనవుతున్నారని, ఫలితంగా- కీలకమైన డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులను సమర్పించుకోవాల్సి వస్తోందనే అంచనాతో ఉంటోంది. ఇషాంత్ శర్మ అందుబాటులోకి రావడం ఆ కొరతను అధిగమించినట్టవుతుందని భావిస్తోంది. ఇషాంత్ శర్మ-అన్రిచ్ నార్ట్జె-కగిసో రబడలతో కూడిన బౌలింగ్ త్రయం.. కొత్త, పాత మేళవింపుతో సమతుల్యంగా ఉంటుందనే నిర్ణయానికి వచ్చింది.
ఇషాంత్ శర్మ ముంబైతో జరిగే మ్యాచ్లో ఆడతాడా? లేదా? అనేది తేలాల్సి ఉంది. అతన్ని తుది జట్టులోకి తీసుకుంటే.. మరొకరిని డగౌట్కు పరిమితం చేయాల్సి ఉంటుంది. ఎవరిని తీసివేయాలనే డైలమాలో ఉంది జట్టు. ఇషాంత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన అవేష్ ఖాన్ జట్టు అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నాడు. ఈ మ్యాచ్ వరకు ఇషాంత్ శర్మకు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. తదుపరి మ్యాచ్ కోసం అతణ్ని అట్టి పెట్టొచ్చని అంటున్నారు.