సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్లో ఆడిన ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎట్టకేలకు ఇంటికి చేరారు. ఐపీఎల్ అర్ధాంతరంగా వాయిదా పడిన మూడు వారాల తరువాత వారు ఇంటికి చేరుకున్నారు. కుటుంబాన్ని కలుసుకున్నారు. వారు ఇంటికొచ్చిన సందర్భంగా భార్యా బిడ్డలు, ఇతర కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఎప్పుడూ లేనివిధంగా ఎయిర్పోర్ట్కు వెళ్లి మరీ వారిని రిసీవ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, పాట్ కమ్మిన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రసవత్తరంగా సాగుతోన్న ఐపీఎల్ 2021 సీజన్పై కరోనా వైరస్ పంజా విసిరిన విషయం తెలిసిందే. వృద్ధిమాన్ సాహా, ప్రసిద్ధ కృష్ణ సహా కొందరు క్రికెటర్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. అదే సమయంలో ఐపీఎల్ మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న నగరాలు ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతల్లో పెద్ద ఎత్తున రోజువారీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ నెల 4వ తేదీన టోర్నమెంట్ను అర్ధాంతరంగా రద్దు చేసింది. ఆ తరువాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.
IPL 2021 Phase 2: వాళ్లు పోయినా వీళ్లు రెడీ: అదే ఊపు..ఊపేస్తారు: ఫైనల్ డేట్ ఫిక్స్
ఆస్ట్రేలియా క్రికెటర్లకు మాత్రం ఆ ఛాన్స్ దక్కలేదు. కరోనా వైరస్ కేసుల తీవ్రత నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం భారత్ నుంచి వచ్చేవారిపై కఠిన ఆంక్షలు విధించింది. భారత్తో వాయు మార్గాన్ని మూసివేసింది. విమాన సర్వీసులను నిలిపివేసింది. ఐపీఎల్ ఆడుతోన్న ఆ దేశ క్రికెటర్లు సొంత గడ్డపై అడుగు పెట్టాలంటే మూడువారాల పాటు క్వారంటైన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందనే నిబంధన విధించింది. దీనితో- ఆసీస్ క్రికెటర్లు, సపోర్టింగ్ స్టాఫ్ అంతా క్వారంటైన్లోకి వెళ్లారు. మాల్దీవుల్లో మూడువారాల పాటు ఐసొలేషన్లో గడిపారు.
అనంతరం ఆస్ట్రేలియాకు చేరిన తరువాత కూడా ఇంటికి వెళ్లే అవకాశం వారికి లేకపోయింది. నిబంధనల ప్రకారం అక్కడ కూడా మూడురోజుల పాటు క్వారంటైన్లో గడిపారు. దాన్ని కూడా ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. సాధారణంగా క్రికెటర్లు ఏడాది పొడవునా విదేశీ పర్యటనల్లో సుదీర్ఘకాలం గడిపేస్తుంటారు. అది సహజమే.. అయినప్పటికీ- ప్రాణాంతక కరోనా వైరస్ కమ్ముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో వారంతా సురక్షితంగా ఇంటికి చేరడం కుటుంబ సభ్యులను భావోద్వేగానికి గురి చేసింది.