ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న లీగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్ల సారథులు ఎలాంటి మార్పులు చేయలేదు. చెన్నై సీనియర్ ఆటగాడు రాబిన్ ఊతప్పకు మళ్లీ నిరాశే ఎదురైంది. రుతురాజ్ గైక్వాడ్పై మహీ నమ్మకం ఉంచాడు.
పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు, రాజస్థాన్ రాయల్స్ అయిదు స్థానాల్లో ఉన్నాయి. ఐపీఎల్ 2021లో రెండు జట్లూ రెండేసి మ్యాచులు ఆడి ఒక్కో గెలుపు, ఒక్కో ఓటమితో సమాన పాయింట్లతో ఉన్నాయి. ఇక ఈరోజు మ్యాచ్లో ఎవరి సత్తా ఎలా ఉండనుందో. ఇరు జట్లలోనూ ప్రధానంగా మిడిలార్డర్ నిలకడ లేమి కనిపిస్తోంది. ఈ సమస్యను ఏ జట్టు అధిగమించి దూసుకుపోతుందో చూడాలి.
ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 23 సార్లు తలపడగా.. 14 విజయాలతో చెన్నైసూపర్ కింగ్సే పైచేయి సాధించింది. రాజస్థాన్ 9 విజయాలకే పరిమితమైంది. అయితే 2015 తర్వాత ఇరు జట్లు హోరాహోరిగా తలపడ్డాయి. చెరో నాలుగు మ్యాచ్ల్లో గెలిచాయి. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్లో రెండు మ్యాచ్ల్లో రాజస్థాన్ విజయం సాధించింది. చెన్నై పిచ్ ఇప్పటి వరకు బౌలింగ్ అనుకూలించగా.. ఆదివారం పంజాబ్-ఢిల్లీ మధ్య జరిగిన పోరులో పరుగుల వరద పారింది. మరి ఈరోజు ఏం జరగనుందో చూడాలి.
తుది జట్లు:
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డూప్లెసిస్, మొయిన్ అలీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, సామ్ కరన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్.
రాజస్థాన్: జోస్ బట్లర్, మనన్ వోహ్రా, సంజూ శాంసన్, శివం దూబే, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరీస్, జయదేవ్ ఉనాద్కత్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్.
IPL 2021: 'వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమే.. నా టార్గెట్ 45! ఐపీఎల్ టైటిల్ గెలుస్తా'