బ్రేక్ త్రూ ఇచ్చిన కరన్:
192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు సూపర్ ఓపెనింగ్ దక్కింది. చెన్నై బౌలర్లపై ఎదురు దాడికి దిగి 3 ఓవర్లలోనే 44 పరుగులు చేసింది. అయితే నాలుతో ఓవర్ వేసిన సామ్ కరన్ చెన్నైకు తొలి బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (8: 7 బంతుల్లో 1 ఫోర్)ని అవుట్ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాతి ఓవర్లోనే అప్పటివరకు బౌండరీలతో విరుచుకుపడుతున్న దేవ్దత్ పడిక్కల్ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేయడంతో ఆర్సీబీ పరుగుల వేగానికి గండి పడింది. పవర్ప్లే ముగిసేసరికి బెంగళూరు 65/2తో కష్టాల్లో పడింది. ఇక జడేజా వేసిన ఏడో ఓవర్లో వాషింగ్టన్ సుందర్ (7) కూడా ఔట్ అయ్యాడు.
తిప్పేసిన జడేజా:
అయితే అప్పటికీ క్రీజులో గ్లెన్ మాక్స్వెల్, ఏబీ డివిలియర్స్ ఉండడంతో బెంగళూరు విజయంపై నమ్మకంగా ఉంది. అయితే జడేజా వారి ఆశలను ఆవిరి చేశాడు. వరుస ఓవర్లలో మ్యాక్స్వెల్, ఏబీని బౌల్డ్ చేసి మ్యాచ్ను చెన్నై వైపు తిప్పేశాడు. 83 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడంతో ఆర్సీబీ ఓటమి ఖరారైపోయింది. డానియల్ క్రిస్టియన్ (1)ని కూడా జడేజానే రనౌట్ చేశాడు. అనంతరం కైల్ జేమీసన్ (16: 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)ను ఇమ్రాన్ తాహిర్ రనౌట్ చేశాడు. అలాగే హర్షల్ పటేల్ను బౌల్డ్ చేయడమే కాకుండా, నవ్దీప్ సైనీ వికెట్ కూడా తీశాడు. చివర్లో యుజ్వేంద్ర చహల్ (8నాటౌట్: 21 బంతుల్లో), మహ్మద్ సిరాజ్(12 నాటౌట్: 14 బంతుల్లో 1 సిక్స్) చివర్లో ఆలౌట్ కాకుండా వికెట్ కాపాడుకున్నారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 9 వికెట్లకు కేవలం 122 పరుగులు మాత్రమే చేయగలిగింది.
డుప్లెసిస్ క్లాస్:
అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. చెన్నై ఇన్నింగ్స్ ఆరంభం నుంచే టాప్ గేర్లో సాగింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (33: 25 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్), ఫాఫ్ డుప్లెసిస్ (50: 41 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్) మంచి ఆరంభాన్నిచ్చారు. వీరి విధ్వంసంతో తొలి వికెట్కు 74 పరుగుల భాగస్వామ్యం లభించింది. చహల్ వేసిన 10వ ఓవర్లో గైక్వాడ్.. జేమీసన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయినా ఏ మాత్రం దూకుడు తగ్గించని డుప్లెసిస్ ఐపీఎల్లో 18వ హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హర్షల్ పటేల్ వేసిన 14వ ఓవర్లో డుప్లెసి ఔటైన తర్వాత స్కోరు వేగం తగ్గింది.
జడేజా విధ్వంసం:
సురేశ్ రైనా (24: 18 బంతుల్లో 1ఫోర్, 3సిక్సర్లు) ఉన్నంతసేపు ఆకట్టుకున్నాడు. అంబటి రాయుడు (14) సిక్స్, ఫోర్ బాది ఔట్ అయ్యాడు. ఇన్నింగ్స్ మొదట్లో చెన్నై జోరు చూస్తే.. ఆ జట్టు స్కోరు అలవోకగా 180 దాటేలా కనిపించింది. అయితే మధ్య ఓవర్లలో బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ వికెట్లు తీయడంతో భారీ స్కోరు కష్టమనిపించింది. అనూహ్యంగా చెలరేగిన రవీంద్ర జడేజా (62 నాటౌట్: 28 బంతుల్లో 4ఫోర్లు, 5సిక్సర్లు) చివరి ఓవర్లో సిక్సర్ల వర్షం కురిపించాడు.హ ర్షల్ పటేల్ వేసిన 20వ ఓవర్లో జడేజా వరుసగా 6 6 N(నోబాల్)6 6 2 6 4 బాదడంతో ఒకే ఓవర్లో 37 పరుగులు వచ్చాయి. జడ్డూ వీరవిహారం చేయడంతో చెన్నై అనూహ్యంగా 190 మార్క్ దాటింది. మొదటి మూడు ఓవర్లను కట్టుదిట్టంగా వేసి మూడు వికెట్లు తీసిన హర్షల్ (3/51).. చివరి ఓవర్లో తేలిపోయాడు.