
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్లో భాగంగా.. ఓ హైఓల్టేజ్ మ్యాచ్ ఆరంభం కాబోతోంది. ఈ మ్యాచ్ ఆరంభం కావడానికి 48 గంటల ముందు నుంచే ఈ రెండు జట్ల పేర్లు ట్రెండింగ్లో ఉంటూ వచ్చాయి. ఈ మ్యాచ్ కోసం సోషల్ మీడియా ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తోందనేది అర్థం చేసుకోవచ్చు. అన్ని జట్ల అభిమానుల కళ్లన్నీ ఈ మ్యాచ్ మీదే. ఇద్దరు లెజెండరీ క్రికెటర్ల మధ్య జరిగే యుద్ధం లాంటి మ్యాచ్ అది. ఎవరు గెలిచినా.. ఇంకెవరు ఓడినా.. హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా. ఇందులో సందేహాలకు మరో ఛాన్స్ లేదు.
ధోనీ వర్సెస్ కోహ్లీ
ఆ ఇద్దరు-చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కిప్పర్ విరాట్ కోహ్లీ. ఒకరకంగా వీరిద్దరూ గురుశిష్యులే. టీమిండియాలో ఇద్దరు కలిసి పనిచేశారు. ధోనీ సారథ్యంలో కోహ్లీ వైస్ కేప్టెన్గా వ్యవహరించిన మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి. ఒకరికి ఒకరు పోటీ పడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ధోనీ టీమిండియా నుంచి రిటైర్డ్ అయ్యాడు. ఆ స్థానాన్ని కోహ్లీ భర్తీ చేశాడు. ధోనీ గైర్హాజరీలోనూ టీమిండియా విజయాల్లో పెద్దగా తేడా ఏమీ ఉండట్లేదు. ధోనీ ఆరంభించిన జైత్రయాత్రను కోహ్లీ అప్రతిహతంగా కొనసాగిస్తున్నాడు. అలాంటి జాతీయ జట్టులో కలిసి పనిచేసిన ధోనీ.. కోహ్లీ ఇప్పుడు ప్రత్యర్థులుగా ఎదురుపడబోతున్నారు.
ఆదివారం మధ్యాహ్నమే..
చెన్నై సూపర్ కింగ్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ముంబై వాంఖెడే స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. విన్నింగ్ ప్రాబబిలటీ 56-44 శాతంగా నమోదవుతోంది. ఈ మ్యాచ్లో బెంగళూరుకే విజయావకాశాలు ఉన్నాయనేది నెటిజన్ల అంచనా. ఈ రెండు జట్లకూ ఇది అయిదో మ్యాచ్ అవుతుంది. నాలుగుకు నాలుగింటినీ గెలిచిన కోహ్లీ అండ్ హిస్ టీమ్.. ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోండగా.. చెన్నై సూపర్ కింగ్స్ రెండో ప్లేస్లో నిలిచింది. నాలుగు మ్యాచ్లను ఆడిన ధోనీ టీమ్.. ఒక దాంట్లో ఓడింది. అనంతరం హ్యాట్రిక్ విజయాలను అందుకుంది.
గురువుగారిదే పైచేయి..
చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టోర్నమెంట్లో ఇప్పటిదాకా 27 సార్లు తలపడ్డాయి. ఇందులో కోహ్లీ గురువు ధోనీదే పైచేయి. బెంగళూరుపై చెన్నై జట్టు మొత్తం 17 సార్లు విజయం సాధించింది. కోహ్లీసేన తొమ్మిది సార్లు గెలిచింది. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఆర్సీబీ అత్యధిక స్కోరు 205 పరుగులు కాగా.. చెన్నైది ఓ మూడాకులు ఎక్కువే చదివింది. 208 రన్లు చేసింది. లోయెస్ట్ స్కోర్ 70 కాగా. సీఎస్కేది 82. బెంగళూరు జట్టు ఇప్పటిదాకా ఐపీఎల్ కప్ను ముద్దాడలేదు. ధోనీసేన పరిస్థితి దీనికి భిన్నం. మూడుసార్లు ఛాంపియన్గా ఆవిర్భవించింది. 2010, 20211, 2018లో టైటిల్ ఎగురేసుకెళ్లింది.
చెన్నై పైనా దూకుడు..
ఈ సీజన్ నిజంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బాగా అచ్చివచ్చినట్టు కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా వరుసగా అన్ని మ్యాచ్లను గెలుస్తూ వస్తోందా జట్టు. అద్భుతంగా రాణిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని రంగాల్లోనూ ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. ఓటమి అనేదే లేకుండా టోర్నమెంట్లో దూసుకెళ్తోంది. ప్రత్యేకించి గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్పై కళ్లు చెదిరే విజయాన్ని సాధించింది. రాజస్థాన్ రాయల్స్పై నమోదు చేసిన విజయం..ఈ సారి కప్ గెలిచి తీరాలనే బెంగళూరు జట్టును పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. చెన్నైపైనా అదే దూకుడును కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఓపెనర్లు దేవ్దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, ఏబీ డివిలియర్స్, వాషింగ్టన్ సుందర్ వంటి హిట్టర్లు, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, నవ్దీప్ షైనీ, యజువేంద్ర చాహల్ వంటి నాణ్యమైన బౌలర్లు ఉన్నారు.
హ్యాట్రిక్ విజయాలతో..
బెంగళూరు కంటే భిన్నంగా ఏమీ ఉండట్లేదు చెన్నై ఆటతీరు. ఈ సీజన్లో ఎదుర్కొన్న తొలి మ్యాచ్లో ఓటమి అనంతరం చెన్నై లయన్స్ జూలు విదిలించారు. వరుసగా మూడు మ్యాచ్ను ఎగరేసుకెళ్లారు. బ్యాటింగ్.. బౌలింగ్లో ఈ రెండు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. ఎలాంటి బ్యాట్స్మెన్నయినా క్రీజ్లో కట్టి పడేయగలరు. చెన్నై కూడా అంతే. ఆ జట్టులో ఓపెనర్లు మొదలుకుని లోయర్ ఆర్డర్ వరకూ బ్యాటింగ్ చేయగల సమర్థలు ఉన్నారు. డుఫ్లెసిస్, ధోనీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, సామ్ కుర్రన్, శార్దుల్ ఠాకూర్ వంటి ఆల్రౌండర్లు ఉన్నారు. రెండు సమవుజ్జీ జట్ల మధ్య మ్యాచ్ ఎలా ఉంటుందనేది రెండురోజుల ముందు నుంచే ఉత్కంఠతకు గురి చేస్తోంది.