For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: అందుకే ఎంఎస్ ధోనీతోనే రిటైర్మెంట్ ఇచ్చా: సురేశ్‌ రైనా

Raina revealed why He and MS Dhoni retired on same day

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించి నేటికి సరిగ్గా ఏడాది గడిచింది. సరిగ్గా ఏడాది క్రితం (2020 ఆగస్టు 15)న రాత్రి 7 గంటల 29 నిమిషాలకు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతున్నట్టు మహీ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించి అభిమానులకు భారీ షాక్‌ ఇచ్చాడు. ఇది జరిగిన కాసేపటికే టీమిండియా క్రికెటర్‌, మిస్టర్ ఐపీఎల్ సురేశ్‌ రైనా కూడా తన రిటైర్మెంట్‌ ప్రకటన చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కోసం చెన్నైలోని చైన్నై సూపర్‌ కింగ్స్‌ క్యాంప్‌లో చేరిన కొద్దిసేపటికే వీరిద్దరి రిటైర్మెంట్‌ ప్రకటనలు వెలువడ్డాయి. అయితే ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన రోజునే తాను కూడా ఎందుకు రిటైర్ అయ్యాడో తాజాగా రైనా తెలిపాడు.

'క్రికెట్ ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటన చేయాలని ముందుగానే ఎంఎస్ ధోనీ, నేను అనుకుని నిర్ణయం తీసుకున్నాం. అందుకు తగినట్లుగా మా మెదడును మలుచుకున్నాం. ధోనీ జెర్సీ నంబర్‌ 7.. నా జెర్సీ నంబర్‌ 3. ఇద్దరి నంబర్లు ఒకచోట చేరిస్తే 73. అప్పుడు 73 స్వాతంత్య్ర దినోత్సవం వచ్చినందున 73 నంబర్‌కు విశ్రాంతి కల్పిస్తే బాగుంటుందనుకున్నాం. అలాగే సరిగ్గా 73వ స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ధోనీ, నేనూ రిటైర్మెంట్‌ ప్రకటన చేశాం. అంతే తప్ప మరో ఉద్దేశం ఏమీ లేదు' అని మిస్టర్ ఐపీఎల్ సురేశ్‌ రైనా తెలిపాడు.

'ఎంఎస్ ధోనీ తన కెరీర్‌ను 2004 డిసెంబర్‌ 23 న ప్రారంభించగా.. ఆరు నెలలు ఆలస్యంగా నేను భారత జట్టులోకి వచ్చాను. అంతర్జాతీయ క్రికెట్‌ను ఇద్దరం కలిసి దాదాపు ఒకేసారి ప్రారంభించినందున మా ఇద్దరిలో స్నేహం పెరిగింది. రిటైర్‌ తీసుకున్న తర్వాత చైన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)లో కూడా కలిసే ఉన్నాం. అంతర్జాతీయ కెరీర్‌ ముగిసినా.. ఐపీఎల్‌లో మాత్రం ఇద్దరం కలిసే ఆడతాం. మహీ అంటే నాకు చెప్పలేని ఇష్టం. అతడితో కలిసి ఆడినందుకు గర్వపడుతున్నా. ఐపీఎల్ టోర్నీలో ఇంకా ఆడుతుందనుకు ఆనందంగా ఉంది' అని సురేష్ రైనా చెప్పుకొచ్చాడు.

ఎంఎస్ ధోనీ తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 90 టెస్ట్‌లు, 350 వన్డేలు, 98 టీ20లు భారత్ తరఫున ఆడాడు. ప్రపంచంలో ఎవరికీ సాధ్యంకాని విధంగా మూడు ఐసీసీ ట్రోఫీలను టీమిండియాకు అందించాడు. కెప్టెన్‌ కూల్‌గా పేరొందిన ధోనీ.. భారత్‌కు ఎన్నో మరుపురాని విజయాలనందించాడు. 2007 టీ20 ప్రపంచకప్.. 2010, 2016 ఆసియా కప్‌లు.. 2011 ప్రపంచకప్‌తో పాటు 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలు ధోనీ సారథ్యంలో అందుకున్నవే. 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనలే ధోనీకి అంతర్జాతీయ చివరి మ్యాచ్‌. ఇందులో రనౌటయిన ధోనీ తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడలేదు. మరోవైపు సురేశ్‌ రైనా తన 14 ఏళ్ల కెరీర్‌లో 18 టెస్ట్‌లు, 226 వన్డేలు, 78 టీ20లు, 200 ఐపీఎల్‌ మ్యాచులు ఆడాడు.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ రెండో దశ మ్యాచ్‌లు జరగనుండగా.. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ దుబాయ్ చేరుకుంది. త్వరలోనే ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న మిగిలిన క్రికెటర్లు కూడా అక్కడికి రానున్నారు. ఎంఎస్ ధోనీ, అంబటి రాయుడు, సురేష్ రైనా యూఏఈ చేరుకున్నారు. ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాపడే సమయానికి 7 మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ (12 పాయింట్లు) ఆరు విజయాలతో ఉండగా.. మూడో స్థానంలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (10 పాయింట్లు), నాలుగులో ముంబై ఇండియన్స్ (8 పాయింట్లు) ఉన్నాయి.

Story first published: Sunday, August 15, 2021, 21:41 [IST]
Other articles published on Aug 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+