
అదే నా అదృష్టం:
తాజాగా చెతేశ్వర్ పుజారా మాట్లాడుతూ... 'జాతీయ జట్టుకు మంచి ప్రదర్శనలు చేసిన వారిని గౌరవించే ఫ్రాంచైజీకి (సీఎస్కే) ఆడుతున్నందుకు గర్వంగా ఉంది. ధోనీ భాయ్ సారథ్యంలో పునరాగమనం చేయడం నా అదృష్టం. నా అంతర్జాతీయ అరంగేట్రం మహీ నేతృత్వంలోనే జరిగింది. సుదీర్ఘకాలం క్రికెట్తో అనుబంధం ఉన్న ఎన్ శ్రీనివాసన్.. నా గురించి అలా మాట్లాడటం గొప్పగా అనిపించింది. ఇది నాకో భావోద్వేగ సందర్భం' అని తెలిపాడు. కేవలం టెస్టు ప్లేయర్ ముద్ర కారణంగానే గత ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో పుజారాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోగా.. చివరకు సీఎస్కే అతన్ని దక్కించుకుంది.

ఎక్కువగా రేటింగ్ ఇచ్చుకోను:
'టీ20 ఆటగాడిగా నాకు ఎక్కువగా రేటింగ్ ఇచ్చుకోను. టీ20 క్రికెటర్గా నేనెక్కడ నిలబడతానో తెలియదు. కానీ ఒక క్రికెటర్గా మాత్రం మెరుగైన స్థానంలో ఉంటాను. అంతర్జాతీయ క్రికెట్ అనుభవంతో టీ20 ఫార్మాట్లో రాణించగలనన్న నమ్మకం ఉంది. సరైన జట్టులో నేను ఉన్నానని అనిపిస్తోంది. ఫ్రాంచైజీ, కెప్టెన్, సహాయ సిబ్బంది, ఇంకా చాలామంది నన్ను నడిపించగలరు. నేనిప్పుడు ఆటను మరింత బాగా అర్థం చేసుకుంటున్నాను. అందుకే ఐపీఎల్లో ఏం చేయాలో తెలుసు' అని పుజారా అన్నాడు.

అవకాశాలు వస్తే:
'క్రికెట్ ఆడటం నాకు ఇష్టం. ఏ ఫార్మాట్నూ మిస్సవ్వాలని కోరుకోను. ఇప్పుడు ఐపీఎల్లో భాగమవ్వడం సంతోషంగా ఉంది. క్రికెటర్గా మరింత ఎదిగేందుకు ఇది నాకు సాయపడుతుంది. నేను టెస్టు స్పెషలిస్టు అన్న ముద్ర పడింది. మిగతా ఫార్మాట్లలో మరిన్ని అవకాశాలు వస్తే.. అలాంటి దృక్పథం ప్రజల్లో పోతుంది. అలాగని ప్రపంచకప్లో అవకాశం ఇవ్వాలని కాదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎక్కువ అవకాశాలు ఇస్తే.. మెరుగైన వన్డే క్రికెటర్గా ఎదగగలను. అందులో సందేహం లేదు' అని పూజి చెప్పుకొచ్చాడు.

సీఎస్కే తీసుకోవడంతో:
చివరిసారి 2014లో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడిన చతేశ్వర్ పుజారా.. 2011 నుంచి 2013 వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి ప్రాతినిథ్యం వహించాడు. ఏడేళ్ల నుంచి ప్రతీసారి వేలంలో తన పేరును నమోదు చేసుకుంటున్నా.. ఏ ఫ్రాంచైజీ ఆసక్తికనబరచలేదు. తాను టెస్టు ప్లేయర్నే కాదని, అన్ని ఫార్మాట్లు ఆడే సత్తా ఉందని పదేపదే మొత్తుకున్నా.. పుజారాను ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరికి 2021లో సీఎస్కే తీసుకోవడంతో పుజారా తన ఆటకు పదును పెట్టే పనిలో పడ్డాడు. ఇప్పటికే చెన్నై శిబిరంలో చేరి ముమ్ముర సాధన చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications












