
ప్రణాళిక ప్రకారమే గౌతమ్, అలీలను తీసుకుందా:
ఐపీఎల్ 2021 వేలానికి ముందు చెన్నైకి ఒక విదేశీ టాపార్డర్ బ్యాట్స్మన్, బ్యాటింగ్ ఆల్రౌండర్, ఆఫ్ స్పిన్నర్ అవసరం కనిపించింది. వేలంలో కృష్ణప్ప గౌతమ్, మొయిన్ అలీలను చెన్నై తీసుకుంది. ఈ ఇద్దరు టాప్ ప్లేయర్లు ఆఫ్ స్పిన్ వేస్తూ ధాటిగా బ్యాటింగ్ చేయగలరు. టెస్టు స్పెషలిస్ట్ చేతేశ్వర్ పుజారాను ఎంచుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగించినా.. నెమ్మదైన పిచ్లపై అతని శైలి ఆటగాడు ఒకరు జట్టులో ఉంటే మంచిదే. హైదరాబాద్కు చెందిన భగత్ వర్మ, ఆంధ్ర ఆటగాడు హరిశంకర్ రెడ్డిలతో పాటు సి హరి నిశాంత్ టీమ్లోకి వచ్చారు. అయితే విదేశీ టాపార్డర్ బ్యాట్స్మన్ లేని లోటు మాత్రం అలాగే ఉండిపోయింది.

బలాలు:
ఫాఫ్ డుప్లెసిస్, రాబిన్ ఉతప్పలు మంచి ఆరంభం ఇవ్వగల సమర్థులు. గతేడాది వ్యక్తిగత కారణాలతో టోర్నీకి దూరమయిన సురేశ్ రైనా జట్టులోకి రావడం కలిసొచ్చే అంశం. రైనా మళ్లీ పచ్చ జెర్సీ తొడిగాడంటే చెన్నైకు పరుగుల పండగే. తర్వాత వచ్చే అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, సామ్ కరన్, డ్వేన్ బ్రేవో భారీ స్కోర్లు చేయగలిగితే చెన్నైకి తిరుగుండదు. బౌలింగ్లో దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, కరన్ కీలకం కానున్నారు. అలీ, కరన్లకు ఇటీవలే భారత గడ్డపై ఆడిన అనుభవం ఉండటం జట్టుకు మేలు చేసే అంశం. ఎప్పటిలాగే మహీ బ్యాటింగ్, అతని నాయకత్వంపైనే అందరి దృష్టి ఉంది. ఆటగాడిగా ఇది అతనికి ఆఖరి సీజన్ కావచ్చని వినిపిస్తున్న నేపథ్యంలో ఎలా టీమ్ను నడిపిస్తాడనేది చూడాలి.

బలహీనతలు:
రైనా పునరాగమనం చేయడం మంచిదే అయినా.. 2019 ఐపీఎల్ నుంచి అతను కేవలం ఐదు టీ20 మ్యాచ్లే ఆడాడు. చెన్నైలో జడేజా, బ్రావో లాంటి ఆల్రౌండర్లు ఎంత ముఖ్యమైన ఆటగాళ్లో మనకు తెలిసిందే. అయితే ఈ సీజన్కు ముందు వారిద్దరూ గాయాలబారిన పడటమే ఇప్పుడా జట్టును కంగారు పెట్టించే విషయాలు. ప్రస్తుతం జడ్డూ, బ్రావో కోలుకున్నా.. రాబోయే మెగా ఈవెంట్లో ఎలా ఆడతారో చూడాలి. ధోనీ, రాయుడు, తాహిర్లకు సుదీర్ఘ కాలంగా మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం లోటే. చెన్నైలో కాకుండా అన్ని మ్యాచ్లు తటస్థ వేదికల్లోనే ఆడాల్సి రావడంతో ఈసారి స్పిన్ ప్రణాళికలు కాకుండా.. కొత్త ప్లాన్లు రచించుకోవాల్సి ఉండడం.

భారీ ఎదురుదెబ్బ:
14వ సీజన్కు ముందు చెన్నైకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు ఆ జట్టు పేసర్, ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ హాజిల్వుడ్ ప్రకటించాడు. పలు సిరీస్లు, లీగ్ల కోసం 10 నెలలుగా బయోబబుల్లోనే ఉంటున్నానని, అందుకే క్రికెట్ నుంచి విరామం తీసుకోవాలని అనుకున్నట్టు చెప్పాడు. అలాగే ఈ ఏడాది జరిగే యాషెస్, టీ20 ప్రపంచకప్నకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండేందుకు ఈ విశ్రాంతి తనకు ఉపయోగపడుతుందని హాజిల్ అన్నాడు.

జట్టు వివరాలు
భారత ఆటగాళ్లు: ధోనీ (కెప్టెన్), రైనా, జడేజా, చహర్, ఠాకూర్, రాయుడు, పుజారా, కరణ్ శర్మ, ఉతప్ప, కృష్ణప్ప గౌతమ్, రుతురాజ్, భగత్ వర్మ, హరిశంకర్ రెడ్డి, హరి నిశాంత్, జగదీశన్, కేఎస్ ఆసిఫ్, సాయి కిషోర్.
విదేశీ ఆటగాళ్లు: తాహిర్, అలీ, డుప్లెసిస్, బ్రేవో, ఇన్గిడి, సాన్ట్నర్, కరన్.
IPL 2021: ఐపీఎల్ 2021 ఆతిథ్యానికి హైదరాబాద్ సిద్ధం: అజహరుద్దీన్


Click it and Unblock the Notifications
