
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సత్తాచాటాలన్న నిరంతర ఒత్తిడి టీ20 ప్రపంచకప్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు మేలు చేసేదేనని ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు. టీ20 ప్రపంచకప్ భారత్లో జరుగనున్న నేపథ్యంలో.. ఇక్కడి పరిస్థితులకు బాగా అలవాటు పడేందుకు తమ ఆటగాళ్లకు ఐపీఎల్ గొప్ప అవకాశం అని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2021 ఆరంభానికి సమయం దగ్గరపడుతోంది. 14వ ఎడిషన్ ఐపీఎల్.. ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమయి మే 30న ముగుస్తుంది. ఐపీఎల్ 2021 కోసం పలు జట్లు తమ సాధనను ముమ్మరం చేశాయి.
స్కై స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో బెన్ స్టోక్స్ మాట్లాడుతూ... 'గత అయిదేళ్లుగా ఐపీఎల్లో ఇంగ్లండ్ ఆటగాళ్ల సంఖ్య పెరుగుతోంది. వ్యక్తిగతంగానే కాకుండా మా జట్టులో ఉన్నవాళ్లందరికీ ఇది గొప్పే. ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్లో ఆడటం ద్వారా మంచి అనుభవం లభిస్తుంది. సత్తాచాటాలన్న నిరంతర ఒత్తిడి కూడా మంచిదే' అని అన్నాడు. ఇయాన్ మోర్గాన్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్స్టో, జోఫ్రా ఆర్చర్, మొయిన్ అలీ, సామ్ కరన్, టామ్ కరన్, సామ్ బిల్లింగ్స్, లియామ్ లివింగ్స్టోన్ మరియు డేవిడ్ మలన్ సహా మరికొందరు ఐపీఎల్ ఆడుతున్న విషయం తెలిసిందే.
'క్రికెటర్ల ఆటను కోట్ల మంది వీక్షిస్తుంటారు. ఫ్రాంచైజీ నుంచి బాగా ఆడాలన్న ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులకు అలవాటు పడటం జట్టుగా మాకెంతో ఉపయోగపడుతుంది. టీ20 ప్రపంచకప్ భారత్లో జరుగనున్న నేపథ్యంలో.. ఇక్కడి పరిస్థితులకు బాగా అలవాటు పడేందుకు ఇంగ్లీష్ ఆటగాళ్లకు ఐపీఎల్ 2021 గొప్ప అవకాశం' అని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు. గత కొన్ని సీజన్లుగా రాజస్థాన్ రాయల్స్ తరఫున స్టోక్స్ ఆడుతున్న విషయం తెలిసిందే. గతేడాది లేటుగా వచ్చినా.. తన మార్క్ ఆటతో ఆకట్టుకున్నాడు.
ప్రారంభ సీజన్ 2008లో విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్.. గతేడాది ఐపీఎల్లో ఆఖరి స్థానంలో నిలిచింది. తమ లీగ్ చరిత్రలోనే తొలిసారి ఇలాంటి పరాభవం ఎదుర్కొంది. స్టార్ ఆటగాళ్లకు కొదవ లేకపోయినా.. ఇలాంటి ఫలితంతో టీమ్ మేనేజ్మెంట్ అసంతృప్తి చెందింది. ఈ దెబ్బకు ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ జట్టు నుంచి స్థానం కోల్పోవాల్సి వచ్చింది. అతడి స్థానంలో ఈసారి జట్టును యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ నడిపించబోతున్నాడు.