
చెన్నై: ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్కు ఐపీఎల్లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. అంతేకాదు ఐపీఎల్ 2021కి ముందు అతడు కోరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టే కొనుగోలు చేసింది. బెంగళూరు ప్రాంచైజీ మ్యాక్సీని రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ప్రైస్తో వేలంలోకి వచ్చిన మ్యాక్స్వెల్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అతని కోసం బెంగళూరు, చెన్నై ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి బెంగళూరే అతన్ని దక్కించుకుంది.
రూ.5 కోట్ల నుంచి చెన్నై, బెంగళూరు గ్లెన్ మ్యాక్స్వెల్ కోసం విపరీతంగా పోటీపడ్డాయి. అయితే చెన్నై వద్ద తక్కువ మొత్తమే ఉండటంతో రూ.14 కోట్ల వరకు ప్రయత్నించి చివరకు వదిలేసింది. చివరికి బెంగళూరే అతన్ని రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది. వేలానికి రెండు రోజుల ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బెంగళూరు సారథి విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం ఇష్టమని, అతని సారథ్యంలో ఆడేందుకు ఎదురు చూస్తున్నానని తెలిపాడు.ఏబీ డివిలియర్స్ కూడా తనకు ఇష్టమైన ఆటగాడని పేర్కొన్నాడు. అనుకున్నట్టుగానే బంగళూరు జట్టుకు ఆడనున్నాడు.
గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 టోర్నీలో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడిన గ్లెన్ మాక్స్వెల్ 13 మ్యాచ్ల్లో కేవలం 108 పరుగులే చేశాడు. సిక్సర్ల కింగ్ అని పేరున్న మ్యాక్సీ.. టోర్నీ ఆసాంతం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. రూ.10.75 కోట్లు వెచ్చించి మరీ తీసుకున్న ఆ జట్టు అంచనాలను పూర్తిగా తలకిందులు చేశాడు. దీంతో అతడి ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే పంజాబ్ తర్వాతి సీజన్కు అతడిని వదిలేసింది.