అంత ధరంటే ఆశ్చర్యమే
క్రైస్ట్చర్చ్ వేదికగా సోమవారం ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కు డేవిడ్ వార్నర్ కామెంటర్గా వ్యవహరించాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ బౌలింగ్ చేస్తున్న సమయంలో అతని ఐపీఎల్ వేలంపై వార్నర్ సరదాగా స్పందించాడు. 'ఐపీఎల్ 2021 వేలంలో మాక్స్వెల్కు భారీ ధర పలకడం చెడ్డ విషయమేమీ కాదు. అయితే ఓ ఫ్రాంఛైజీ వదులుకున్న ఆటగాడికి మరో ఫ్రాంఛైజీ అంతకంటే ఎక్కువ ధర చెల్లించడం ఆశ్చర్యంగా ఉంది' అని నవ్వుతూ అన్నాడు. దీనికి మరో వ్యాఖ్యాత మార్క్ వా స్పందిస్తూ... 'గత ఐపీఎల్ సీజన్ ప్రదర్శన ఆధారంగా తీసుకున్నారనుకుంటా' అని బదులిచ్చాడు.
ఒక్క సిక్స్ కూడా లేదు
గ్లెన్ మాక్స్వెల్ చాలా కాలంగా ఐపీఎల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల తరఫున ఇదివరకు ఆడాడు. 2020 సీజన్కు పంజాబ్ అతడిని రూ.10.75 కోట్ల అత్యధిక ధరకు కొనుగోలు చేయగా తీవ్రంగా నిరాశ పరిచాడు. 13 మ్యాచ్ల్లో కేవలం 108 పరుగులే చేశాడు. సిక్సర్ల కింగ్ అని పేరున్న మ్యాక్సీ.. టోర్నీ ఆసాంతం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. కోట్లు వెచ్చించి మరీ తీసుకున్న ఆ జట్టు అంచనాలను పూర్తిగా తలకిందులు చేశాడు. దీంతో అతడి ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే పంజాబ్ అతడిని వదిలేసింది.
తొలి టీ20లో ఒకే పరుగు
ఐపీఎల్ 2020 అనంతరం స్వదేశంలో టీమిండియాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్లలో గ్లెన్ మాక్స్వెల్ రాణించాడు. బౌండరీలు, సిక్సులతో మైదానాన్ని హోరెత్తించాడు. ఆపై మ్యాక్సీ న్యూజిలాండ్తో టీ20 సిరీస్ ఆడుతున్నాడు. సోమవారం జరిగిన తొలి మ్యాచ్లో మాక్స్వెల్ ఒక పరుగుకే వెనుదిరిగాడు. అయితే ఒక్కోసారి మాక్స్వెల్ ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేస్తాడు. అందుకే అతడిపై అందరూ నమ్మకం ఉంచుతున్నారు. ఐపీఎల్ 20221 ఏప్రిల్ చివరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
కివీస్ ఘన విజయం
తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. కాన్వే భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో డేనియల్ సామ్స్, జే రిచర్డ్సన్ తలో రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన ఆసీస్కు కివీస్ బౌలర్లు జలక్ ఇచ్చారు. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్లు తొలి 5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు తీశారు. మరో 2.3 ఓవర్లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా 131 రన్స్కు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (45; 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్.
India vs England: ఉమేశ్ ఇన్.. శార్దూల్ ఔట్! గులాబి టెస్టుకు సిరాజ్, కుల్దీప్ డౌటే!!