
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తాను అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గాకొనసాగుతున్నానని, అంతకు మించి ఏం చేయాలి అని ఢిల్లీ క్యాపిటల్స్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా పేర్కొన్నాడు. తన విషయంలో ఇతరులు ఏమనుకుంటున్నా పట్టించుకోనని, తనకు ఆటపై ఇంకా ఇష్టం ఉండటం వల్లే ఆడుతున్నానని చెప్పాడు. వేలి గాయం కారణంగా ఐపీఎల్ 2020 నుంచి మిశ్రా మధ్యలోనే తప్పుకున్నాడు. అయితే ఆడిన మూడు మ్యాచులలో 0/23, 2/35, 1/14 గొప్ప గణాంకాలను నమోదు చేశాడు. ఈ సీజన్ కోసం మిశ్రా వేచిచూస్తున్నాడు.
తాజాగా అమిత్ మిశ్రా పీటీఐతో మాట్లాడుతూ... 'నా గురించి ఇతరులు అనుకుంటున్నా వాటిని నేను ఆపలేను. అయితే నా శక్తి సామర్థ్యాలకు నిదర్శనం ఏమిటంటే.. ప్రపంచంలోనే అత్యంత పోటీగల టీ20 లీగ్లో (ఐపీఎల్) 13 ఏళ్లుగా ఆడుతున్నా. అదే ఒక ఘనత. ఇంకా ఈ లీగ్లో నేను అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నా. ఇంతకు మించి ఏం చేయాలి. అతిగొప్ప లీగ్లో అత్యుత్తమ ఆటగాడిగా ఉన్నా. చాలా సంతోషంగా ఉంది' అని అన్నాడు.
'మైదానంలోకి దిగానంటే నా పని వికెట్లు తీయడమే. ఎన్నో ఏళ్లుగా అదే చేస్తున్నా. ఇప్పుడు నా గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోను. వాళ్ల మాటలతో ఏ ప్రయోజనం ఉండదు. క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఇంకా ఆడుతున్నా. వచ్చే ఏడాది నా శరీరం సహకరిస్తే.. దేశవాళీ క్రికెట్ ఆడతా' అని అమిత్ మిశ్రా తెలిపాడు. 150 మ్యాచ్ల్లో 160 వికెట్లు తీసిన మిశ్రా.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. లసిత్ మలింగ ఐపీఎల్లో 170 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు.
'ఏదైనా లెగ్ స్పిన్నర్కు మంచి కెప్టెన్ అవసరం. ఎందుకంటే.. బౌలర్ గతితప్పినప్పుడు కెప్టెన్ అవసరం ఎంతో ఉంటుంది. కొన్ని పరుగులు ఇచ్చినప్పటికీ అండగా నిలబడాలి. అప్పుడే బౌలర్ ఆత్మవిశ్వసంతో బౌలింగ్ చేస్తాడు. గత 5-6 సంవత్సరాలలో టీమిండియాకు కొంతమంది మంచి లెగ్-స్పిన్నర్లు దొరికారు. వారు థన్ అనుభవాన్ని తరువాతి తరంతో పంచుకుంటే బాగుంటుంది' అని అమిత్ మిశ్రా చెప్పుకొచ్చాడు. మిశ్రా భారత్ తరఫున 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. మొత్తంగా 156 వికెట్లు పడగొట్టాడు.