
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ తొలి మ్యాచ్.. అభిమానులకు అసలైన మజాను పంచింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆఖరి బంతికి చేధించింది. 'మిస్టర్ 360' ఏబీ డివిలియర్స్ చెలరేగడంతో బెంగళూరు టోర్నీలో బోణీ కొట్టింది. డివిలియర్స్ 27 బంతుల్లో 48 పరుగులు చేసి కీలక సమయంలో పెవిలియన్ చేరాడు. అయితే చివరి రెండు బంతుల్లో 2 పరుగులు అవసరం కాగా.. మొహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ చెరో సింగల్ తీసి బెంగళూరుకు అద్భుత విజయాన్ని అందించారు. ఇక ఐపీఎల్ తొలి మ్యాచ్లో ఓడే తన ఆనవాయితీని ముంబై ఇండియన్స్ కొనసాగించింది. ముంబై బౌలర్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.
ఇన్నింగ్స్ను నిర్మించిన మాక్స్వెల్, కోహ్లీ:
160 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (33; 29 బంతుల్లో 4x4), వాషింగ్టన్ సుందర్ (10) ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఈ ఇద్దరూ తొలి వికెట్కు 36 పరుగులు జోడించారు. సుందర్ తొలి వికెట్గా వెనుదిరగ్గా.. వన్డౌన్ బ్యాట్స్మన్ రజత్ పాటిదార్ (8) సైతం నిరాశపరిచాడు. ఓ బౌండరీ బాది ఊపుమీద కనిపించినా.. దూరంగా వెళుతున్న బంతిని వెంటాడి బోల్ట్ అయ్యాడు. దాంతో బెంగళూరు 46 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆపై మాక్స్వెల్ (39; 28 బంతుల్లో 3x4, 2x6), కోహ్లీ నిలకడగా ఆడి ఇన్నింగ్స్ను నిర్మించారు. ఈ క్రమంలోనే మూడో వికెట్కు 52 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
డివిలియర్స్ మెరుపులు:
కోహ్లీ, మ్యాక్స్వెల్ క్రీజులో ఉండడంతో ఆర్సీబీ ఈజీగా మ్యాచ్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. ముంబై స్టార్ బౌలర్ బుమ్రా కోహ్లీ ని ఔట్ చేసి మ్యాచ్ను ముంబై వైపు తిప్పాడు. ఆ వెంటనే మ్యాక్స్వెల్ కూడా అవుట్ కావడంతో బెంగళూరు గెలుస్తుందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే అక్కడి నుంచి డివిలియర్స్ బాధ్యత తీసుకున్నాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ బెంగళూరును రేసులోకి తెచ్చాడు. ఇక చివరి ఓవర్లో విజయానికి 7 పరుగులు అవసరమైన వేళ డివిలియర్స్ రనౌటయ్యాడు. దాంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. సమీకరణం చివరి రెండు బంతుల్లో రెండు పరుగులుగా మారడంతో.. సిరాజ్తో కలిసి హర్షల్ పటేల్ పని పూర్తి చేశాడు.
ఆదుకున్న లిన్, సూర్య:
అంతకుముందు టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. హర్షల్ పటేల్ 5 వికెట్లతో చెలరేగి ముంబై జట్టుకు అడ్డుకట్ట వేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (19; 15 బంతుల్లో 1x4, 1x6) అనవసర పరుగుకు యత్నించి ఆదిలోనే రనౌటయ్యాడు. ఈ సమయంలో క్రిస్ లిన్ (49; 35 బంతుల్లో 4x4, 3x6), సూర్యకుమార్ యాదవ్(31; 23 బంతుల్లో 4x4, 1x6) జట్టును ఆదుకున్నారు. లిన్, సూర్య స్వేచ్ఛగా ఆడి బెంగళూరు బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఈ క్రమంలో వీరిద్దరూ రెండో వికెట్కు కీలకమైన 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో తొమ్మిది ఓవర్లకు ముంబై జట్టు స్కోర్ 83/1కి చేరింది.
ఆఖరి ఓవర్లో నాలుగు వికెట్లు:
అయితే ప్రమాదకరంగా మారుతున్నలిన్, సూర్య జోడీని జేమీసన్ విడదీశాడు. పదో ఓవర్ చివరి బంతికి సూర్యకుమార్ను బోల్తా కొట్టించాడు. కీపర్ డివిలియర్స్కు చిక్కడంతో ముంబయి 94 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. కాసేపటికే లిన్ అర్ధ శతకానికి ఒక్క పరుగు ముందు సుందర్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా (13), ఇషాన్ కిషన్ (28) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. చివర్లో కీరన్ పొలార్డ్ (7), కృనాల్ పాండ్యా (7) కూడా నిరాశపరిచారు. ఇక ఆఖరి ఓవర్లో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు తీసి ఒకే పరుగు ఇవ్వడంతో ముంబై మోస్తరు స్కోరుకే పరిమితమైంది.