
అబుధాబి: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి మరోసారి వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు. అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కించపరిచేలా రవిశాస్త్రి ట్వీట్ చేశారని ఆరోపిస్తున్నారు. ధోనీ అభిమానులు తమ ట్వీట్లతో రవిశాస్త్రిని ఆటాడేసుకుంటున్నారు. ట్రోల్ చేస్తున్నారు. నిద్ర లేచి ముఖం కడుక్కోవాలంటూ ఎద్దేవా చేస్తున్నారు. వాస్తవం ఏమిటో తెలుసుకోకుండా.. కామెంట్స్ చేయడం సరికాదంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్.
రవిశాస్త్రి నేరుగా ధోనీ మీద ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ట్వీట్ను పోస్ట్ చేయలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ వృద్ధిమాన్ సాహాను పొగడటమే దీనికి కారణమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో డిల్లీ కేపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సాహా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 45 బంతుల్లో 87 పరుగులు చేశాడు. కేప్టెన్ డేవిడ్ వార్నర్తో కలిసి ఇన్నింగ్ను ప్రారంభించాడు సాహా ఆ మ్యాచ్లో. తుఫాన్లా చెలరేగాడు. బౌండరీలో విరుచుకు పడ్డాడు.
ప్రారంభంలో వృద్ధిమాన్ సాహా, డేవిడ్ వార్నర్, చివరి ఓవర్లలో మనీష్ పాండే ధాటిగా ఆడటంతో హైదరాబాద్ జట్టు.. ఢిల్లీ కేపిటల్స్కు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ను ఢిల్లీ కోల్పోయింది. 131 పరుగులకు ఆలౌట్ అయింది. బ్యాటింగ్లో సాహా రెచ్చిపోయి ఆడటాన్ని రవిశాస్త్రి ప్రశంసించాడు. బ్యాటింగ్ వరకైతే ఫర్లేదు గానీ.. అతణ్ని ప్రపంచంలోనే అత్యుత్తమ గ్లోవ్మెన్ (వికెట్ కీపర్)గా అభివర్ణించాడు. అక్కడే ధోనీ అభిమానుల చేతికి చిక్కాడు రవిశాస్త్రి.
వృద్ధిమాన్ సాహా ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్ అయితే.. ధోనీ మాటేమిటంటూ నిలదీస్తున్నారు. ఒక్క ఇన్నింగ్కే సాహా ప్రపంచంలోనే బెస్ట్ గ్లోవ్మ్యాన్గా ప్రశంసలు అందుకుంటే.. ధోనీ వందల ఇన్నింగ్స్ ఆడాడని, ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించాడని గుర్తు చేస్తున్నారు. క్రికెట్కు గుడ్బై చెప్పినంత మాత్రాన ధోనీ ప్రతిభను తక్కువగా అంచనా వేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. నిద్రలేచి, కళ్లు తెరిచి ఎవరో అత్యుత్తమ వికెట్ కీపరో నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు. ప్రపంచంలో ధోనీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, అతణ్ని మించి పోలేరని అంటున్నారు.