
ఎట్టకేలకు గెలుపు రుచి..
షార్జా స్టేడియంలో గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విజయాన్ని అందుకున్న తీరు.. ఆ జట్టు పోరాట పటిమను చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ మొత్తం 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్. 39 బంతుల్లో మూడు ఫోర్లతో 48 పరుగులు చేశాడతను. చివరి ఓవర్లలో ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ పిడుగుల్లాంటి షాట్లు ఆడటంతో రాయల్ ఛాలెంజర్స్ భారీ స్కోరును చేయగలిగింది. ఎనిమిది బంతుల్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్తో మోరిస్ 25 పరుగులు చేసి, నాటౌట్గా నిలిచాడు.

రెండు వికెట్లే కోల్పోయినా
ఈ 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి కడదాకా పోరాడింది. చివరిబంతికి సిక్స్ను బాది మ్యాచ్ను తన వైపు తిప్పుకొంది. కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ హాఫ్ సెంచరీలను సాధించారు. ఓపెనర్, జట్టు కేప్టెన్ కేఎల్ రాహుల్ 49 బంతుల్లో అయిదు సిక్సులు, ఒక ఫోర్తో 61 పరుగులు చేశాడు. నాటౌట్గా నిలిచాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఇక క్రిస్ గేల్.. ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లోనే అర్ధసెంచరీతో అదరగొట్టాడు. 45 బంతుల్లో అయిదు సిక్సులు ఒక ఫోర్తో 53 పరుగులు చేశాడు.

ఆ ఒక్క ఓవర్..
ఇలా చివరి బంతి వరకూ మ్యాచ్ సాగడం పంజాబ్ టీమ్ మేనేజ్మెంట్, సపోర్టింగ్ స్టాఫ్నూ ఉత్కంఠతకు గురి చేసింది. ప్లేఆఫ్కు చేరుకోవాలంటే ప్రతి మ్యాచ్ను గెలవాల్సిన దశలో ఉంది పంజాబ్ టీమ్. ప్రతి మ్యాచ్ కూడా చావో రేవో తేల్చుకునే స్థాయికి చేరుకుంది. గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్ చివరి బంతి వరకూ సాగడం, చివరి ఆరు బంతులకు రెండు పరుగులు చేయాల్సిన స్థాయిలో వికెట్ను కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠతగా మారింది. నికొలస్ పూరన్ చివరి బంతికి సిక్స్ను బాదేంత వరకూ పంజాబ్ టీమ్ మేనేజ్మెంట్, సపోర్టింగ్ స్టాఫ్ ఊపిరి పీల్చుకోలేకపోయింది.

గుండె నోట్లో కొచ్చినంత పనైందంటూ..
మ్యాచ్ చివరి ఓవర్ కొనసాగుతున్నంత సేపూ తన గుండెకాయ నోట్లోకొచ్చినంత పనైందని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ కామెంట్ చేశాడు. `థోడీ దేర్ కే లియే గోతీ మూహ్ మే ఆగయా థా..` అంటూ వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్పై పేటెంట్ రైట్స్ టీమిండియా కోచ్ రవిశాస్త్రికి ఉన్నాయి. తొలుత ఆయనే దీన్ని ప్రయోగించాడు. 2017-2018లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్లో జరిగిన మ్యాచ్ సందర్భంగా రవిశాస్త్రి ఈ కామెంట్ చేశాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. ఈ కామెంట్స్ అప్పట్లో వివాదాన్ని రేపాయి. రవిశాస్త్రిని ట్రోల్ చేయడానికి కారణం అయ్యాయి. ఇప్పుడు వసీం జాఫర్ దాన్నే మళ్లీ ప్రయోగించాడు.


Click it and Unblock the Notifications












