
హైదరాబాద్: నేడు విజయదశమి. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖులు దసరా శుభాకాంక్షలు చెప్పారు.
నేడు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని టీమిండియా మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు తమ అభిమానులకు దసరా శుభాకాంక్షలు చెప్పారు. ఎప్పటికైనా చెడుపై మంచే విజయం సాధిస్తుందనడానికి ఈ పండుగే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. 'మన ప్రయాణం ఎంత దూరంగా ఉన్నా ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా చివరికి చెడుపై మంచే విజయం సాధిస్తుంది. మనతో పాటు మన చుట్టూ ఉండేప్రతికూల ప్రభావాలపై విజయం సాధించాలని కోరుతున్నా' సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు.
'ఈ దసరా పండుగ మనందరి జీవితాల్లో అమితమైన ప్రేమతో పాటు మంచిని కూడా తీసుకురావాలి' అని హైదరాబాద్ సొగసరి, టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు. లక్ష్మణ్ హైదరాబాద్ జట్టు కోసం యూఏఈలో ఉన్నారు. ఆ జట్టుకు మెంటార్గా ఉన్నారు.
'ఈ దసరా పండుగ సందర్భంగా మీకూ, మీ కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు. హ్యాపీ దసరా' అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. విరాట్ ప్రస్తుతం ఐపీఎల్ 2020 కోసం యూఏఈలో ఉన్న విషయం తెలిసిందే.
'ఈ విజయదశమి సందర్భంగా శ్రీరాముడు తన ఇష్టప్రకారం అందరి కోరికలు తీర్చాలి. ప్రేమ, కరుణ, నీతి నిజాయతీ గల ఆ రాముడికి జై. హ్యాపీ దసరా.' అని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేసారు.
'ప్రతీ ఒక్కరికీ విజయ దశమి శుభాకాంక్షలు. చెడుపై మంచి గెలిచిన ఈ రోజు రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిమంత్రంగా నిలవాలి. అలాగే ఈ పండుగ మనందరి జీవితాల్లో సుఖ సంతోషాలు తీసుకురావాలని కోరుతున్నా' అని మాజీ ఓపెనర్, ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు.
'అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ చెడుపై మంచి విజయం సాధించాలి. ఇది మన చుట్టే కాదు. మనలోనూ జరగాలి. ఈ శుభ సందర్భంగా అందరికీ సుఖ సంతోషాలు కలగాలి' టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ట్వీట్ చేశాడు.