
వాట్సన్ హాఫ్ సెంచరీ:
ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ఓపెనర్లు షేన్ వాట్సన్ (53 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫాఫ్ డుప్లెసిస్ (53 బంతుల్లో 87 నాటౌట్; 11 ఫోర్లు, ఒక సిక్సర్) అదరగొట్టడంతో ధోనీసేన 17.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 181 పరుగులు చేసింది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన వాట్సన్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

డీజిల్ ఇంజిన్ స్టార్ట్ అయింది:
గత మూడు మ్యాచులలో పరుగులు చేయడంలో బాగా ఇబ్బందిపడ్డ షేన్ వాట్సన్.. పంజాబ్ మ్యాచ్లో ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వాట్సన్ సెంచరీ చేసేలా కనిపించినా.. డుప్లెసిస్ బౌండరీలు బాదడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. ఫామ్ అందుకున్న వాట్సన్పై వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో తనదైన శైలిలో సెటైర్ వేశాడు. 'సెప్టెంబర్ 19 నుంచి సిద్ధంగా ఉన్న డీజిల్ ఇంజిన్ మొత్తానికి స్టార్ట్ అయింది. అంతేకాదు ఫాఫ్ డుప్లెసిస్తో కలిసి కింగ్స్ పంజాబ్ కుర్రాళ్లను ఒక టూర్కు కూడా తీసుకెళ్లింది' అని వాట్సన్ను ఉద్దేశిస్తూ ఫన్నీగా ట్వీట్ చేశాడు.

అది పంజాబ్కు మాత్రమే సాధ్యం:
చెన్నై మ్యాచ్ గెలవడానికి కారణాలు కూడా వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. ఈ మేరకు ఫేస్బుక్లో ఓ వీడియో పోస్టు చేశాడు. '18వ ఓవర్ మ్యాచ్ను మలుపు తిప్పింది. ఆ ఓవర్లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ, రవీంద్ర జడేజా ఫీల్డింగ్ విన్యాసం, శార్దూల్ ఠాకూర్ మెరుపుల్లాంటి బంతులు మ్యాచ్ను చెన్నై వైపు తిప్పాయి' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ ఓడిన పంజాబ్ జట్టుపై కూడా వీరూ స్పందించాడు. 'దుబాయ్లో మొదట బ్యాటింగ్ చేసి కూడా పంజాబ్ ఓడిపోయింది. అది ఆ జట్టుకు మాత్రమే సాధ్యం' అని వ్యంగ్యాస్త్రాలు విసిరాడు.

పంజాబ్కు మెంటార్గా:
ఐపీఎల్లో వీరేంద్ర సెహ్వాగ్ ఆడిన విషయం తెలిసిందే. ఢిల్లీ డేర్డెవిల్స్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల తరఫున వీరూ ఆడాడు. కెప్టెన్, ఓపెనర్గా రాణించాడు. గత ఐపీఎల్లో పంజాబ్కు మెంటార్గా పనిచేసిన సెహ్వాగ్.. ఈసారి టోర్నీకి దూరంగానే ఉంటున్నాడు. అయితే ఇంట్లోనే మ్యాచ్ చూస్తూ ఆస్వాదిస్తున్నాడు. అంతేకాదు తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ అభిమానులను కూడా అలరిస్తున్నాడు.


Click it and Unblock the Notifications












