16న అధికారిక ప్రకటన?:
ఇన్స్టాగ్రామ్లో ఆర్సీబీ పాత పోస్ట్లు కనిపించకపోవడం, ట్విటర్ ఖాతాలో కేవలం 'రాయల్ చాలెంజర్స్'గా మాత్రమే పేర్కొనడంతో పేరు మారబోతుందని విస్తృత ప్రచారం జోరందుకుంది. అయితే ఆర్సీబీ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆర్సీబీ పేరు మార్పుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్టుగా తెలిసింది. ఫిబ్రవరి 16న అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 'Bangalore'ను 'Bengaluru'గా మార్చనున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
కెప్టెన్కు ఎలాంటి సమాచారం లేదు:
సోషల్ మీడియాలో పెద్దఎత్తున వస్తున్న వార్తలపై ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'పోస్ట్లు అదృశ్యమయ్యాయి. కెప్టెన్కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మీకు ఏమైనా సహాయం కావాలంటే నన్ను అడగండి' అని కోహ్లీ ట్వీట్ చేసాడు. ఆర్సీబీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ కూడా స్పందించాడు. 'మా సోషల్ మీడియా ఖాతాలకు ఏం జరిగింది?. ఇది కేవలం వ్యూహాత్మక విరామం అని ఆశిస్తున్నా' అని రాసుకొచ్చాడు.
పోస్ట్లు ఎక్కడికి వెళ్లాయి:
ఆర్సీబీ మరో ఆటగాడు యజ్వేంద్ర చహల్ కూడా ఈ విషయాన్ని (ఆర్సీబీ పేరు మార్పు) ట్విటర్లో ప్రస్తావించాడు. ప్రొఫైల్ పిక్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు ఎక్కడికి వెళ్లాయి' అని సరదాగా ప్రశ్నించాడు. మరోవైపు ఆర్సీబీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్క్రీన్ షాట్ను షేర్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ కూడా 'అంతా ఓకేనా' అని పరామర్శించింది. కోహ్లీ ట్వీట్ చేసిన కొద్ది సేపటికే ఆర్సీబీ సోషల్ మీడియా అకౌంట్లలలో (ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్) ప్రొఫైల్ పిక్ లోడ్ అవుతున్నట్టు ఉండేలా ఓ ఫొటోను పోస్ట్ చేసింది.
ముత్తూట్ ఫిన్కార్ఫ్తో ఒప్పందం:
ఐపీఎల్లో ఆర్సీబీ ఒక్కసారైనా టైటిల్ను సొంతం చేసుకోలేదు. దీనికి తోడు స్థానిక అభిమానులు 'Bangalore' అని పిలవడానికి అంతగా ఆసక్తి కనబరచకపోవడం వల్లనే ఆ జట్టు పేరు మార్చబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుకున్నాయి. ఆ ప్రచారంలో నిజమెంతుందో తెలియాలంటే ఆర్సీబీ నుంచి అధికార ప్రకటన వెలువడే వరకు ఆగాల్సిందే. ఆర్సీబీ ఇటీవల ముత్తూట్ ఫిన్కార్ఫ్తో మూడేళ్ల స్పాన్సర్షిప్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.