
డ్రీమ్ 11 కూడా చైనా సంస్థ?:
భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా ఆ దేశానికి చెందిన వివో కంపెనీని టైటిల్ స్ఫాన్సర్షిప్ నుంచి బీసీసీఐ తప్పించిన విషయం తెలిసిందే. ఇక బిడ్స్ దాఖలు చేసిన బైజూస్, అన్అకాడమీలను కాదని డ్రీమ్ 11కి ఐపీఎల్ స్ఫాన్సర్షిప్ని బీసీసీఐ కట్టబెట్టిన గంటల వ్యవధిలోనే.. ఆ సంస్థ (డ్రీమ్ 11)లోనూ చైనా పెట్టుబడులు ఉన్నాయనే వార్త వెలుగులోకి వచ్చింది. చైనాకి చెందిన టెన్సెంట్ కంపెనీ.. డ్రీమ్ 11లో 10 శాతం పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. దీంతో మళ్లీ వివాదం మొదలైంది. డ్రీమ్ 11 కూడా చైనా సంస్థ? అని విమర్శలు వినిపిస్తున్నాయి. భారత్కే చెందిన కలారి క్యాపిటల్, థింక్ ఇన్వెస్ట్మెంట్స్, మల్టిపుల్స్ ఈక్విటీకి కూడా అందులో పెట్టుబడులు ఉన్నాయి.

వ్యవస్థాపకులు వీరే:
భారతీయ సంస్థ డ్రీమ్ 11ను 2012లో హర్ష్ జైన్, భవిత్ సేత్ స్థాపించారు. ఆ సంస్థలో దాదాపు 400 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి డ్రీమ్ 11 విలువ 2.25 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 17 వేల కోట్లు) కావచ్చని వ్యాపార వర్గాల అంచనా. ఐసీసీ అధికారిక ఫాంటసీ క్రికెట్ ప్లాట్ఫామ్గా ఉండటంతో పాటు కరీబియన్ లీగ్, బిగ్ బాష్, నేషనల్ బాస్కెట్బాల్ లీగ్, ప్రో కబడ్డీ లీగ్ తదితర పోటీలకు స్పాన్సర్గా వ్యవహరించింది. ఐసీసీ, బీబీఎల్, డబ్ల్యుబీబీఎల్ లాంటి వాటితో సంబంధాలు కలిగి ఉంది. 2019 లో 'యునికార్న్ క్లబ్'లో ప్రవేశించిన మొదటి భారతీయ గేమింగ్ సంస్థగా అవతరించింది.

అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్ ధోనీ:
బెట్టింగ్ను ప్రోత్సహింస్తుందని 2017లో డ్రీమ్ 11పై సుప్రీంకోర్టులో కేసు నమోదైంది. అయితే ఆ సంస్థ నైపుణ్యం, జ్ఞానంను పెంచుందని కోర్టులు భావించి అనుమతించాయి. డ్రీమ్ 11కు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్. ఐసీసీ ప్రపంచకప్ 2019 నుండి జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్స్టో, ఫాఫ్ డుప్లెసిస్, క్వింటన్ డి కాక్, కగిసో రబాడా, ఆండ్రీ రస్సెల్, జాసన్ హోల్డర్ మరియు కేన్ విలియమ్సన్లు కూడా అంబాసిడర్లే.

ఏసీయూ విచారణ కూడా:
గతనెల పంజాబ్లో జరిగిన నకిలీ టీ20 లీగ్తో డ్రీమ్11 కంపెనీకి సంబంధాలున్నట్టు వచ్చిన ఆరోపణలపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం విచారణ చేపట్టింది. ఆ మ్యాచ్లు శ్రీలంకలో జరుగుతున్నట్టుగా.. డ్రీమ్11 వెబ్సైట్లో ప్రసారం చేసింది. అలాగే ఆటగాళ్ల కిట్స్పై సదరు కంపెనీ లోగో ఉన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications












