
ఢిల్లీ: టీమిండియా మాజీ వికెట్ కీపర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీని విమర్శించే వాళ్లని చూస్తే జాలేస్తోందని భారత మాజీ క్రికెటర్ సయ్యద్ కిర్మాణి అన్నారు. ప్రతీ ఆటగాడి కెరీర్లో ఎత్తుపల్లాలు ఉంటాయని, కాలాన్ని బట్టి పరిస్థితులు మారతాయన్నారు. మహీ ఐపీఎల్ 2020లో విఫలమవుతున్న విషయం తేగలిసిందే. బ్యాటింగ్, సారథ్యం రెండింట్లో తేలిపోతున్నాడు. ఇక వరుస ఓటుములతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలవడంతో ధోనీపై విమర్శలు ఎక్కువయ్యాయి.
ఎంఎస్ ధోనీ ప్రదర్శన పట్ల విమర్శలు రావడంపై సయ్యద్ కిర్మాణి తాజాగా స్పందించారు. 'ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్లలో ఎంఎస్ ధోనీ ఒకడనే విషయాన్ని మర్చిపోకూడదు. చాలా విరామం తర్వాత అతడు తిరిగి క్రికెట్ ఆడుతున్నాడు. అదే ఈ సీజన్లో అతడి ప్రదర్శనపై ప్రభావం చూపుతోంది. యువకులతో పోలిస్తే.. ఈ వయసులో ఆటగాళ్లకు అంత చురుగ్గా కదలాడే శక్తి ఉండదు. అది కాకుండా వాళ్లకి భవిష్యత్పై అనేక ఆలోచనలు ఉంటాయి. ఇదంతా సహజం. మనం అర్థం చేసుకొని ముందుకు సాగాలి' అని పేర్కొన్నారు.
ఎంఎస్ ధోనీ గతేడాది ఇంగ్లాండ్లో జరిగిన వన్డే ప్రపంచకప్లో చివరిసారి క్రికెట్ ఆడాడు. న్యూజిలాండ్తో జరిగిన సెమీస్లో రవీంద్ర జడేజాతో కలిసి అద్భుత పోరాటం సాగించినా.. అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. చివరికి టీమిండియా ఓటమిపాలైంది. ఆ తర్వాత ధోనీ ఏడాదికి పైగా ఆటకు దూరమయ్యాడు. మళ్లీ ఐపీఎల్ 2020తోనే బరిలోకి దిగాడు. ఇక ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలే సాధించి 5 ఓటములతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఆ జట్టు ఈసారి ప్లేఆఫ్స్కు వెళ్లడం కష్టమనేననిపిస్తోంది. ఇక అన్ని మ్యాచులలో గెలవాల్సిన పరిస్థితి చెన్నైది.
ఇక ఎంఎస్ ధోనీ కూతురు జీవాపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ ఆకతాయి తీరు తీవ్ర దుమారం రేపింది. ఈ విషయమై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది స్పందించాడు. 'ఎంఎస్ ధోనీ, అతని కుటుంబంపై ఎలాంటి బెదిరింపులు వచ్చాయో తెలియదు కానీ వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. అతడు భారత క్రికెట్ను ఉన్నత స్థాయిని తీసుకెళ్లాడు. తన జర్నీలో సీనియర్స్, జూనియర్స్ ఆటగాళ్లను కలుపుకొని వెళ్లాడు. మహీ పట్ల ఈ విధంగా ప్రవర్తించడం గౌరవం అనిపించుకోదు' అని షాహిద్ ట్వీట్ చేశాడు.