
దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ను తిరిగి పటిష్టం చేయడమే మా లక్ష్యం అని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. ఈ సీజన్ ఐపీఎల్లో ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైనా వచ్చే ఏడాది మరింత పటిష్టంగా తిరిగొస్తామని ధీమా వ్యక్తం చేశాడు. యూఏఈలో జరుగుతున్న టీ20 మెగా క్రికెట్ లీగ్లో చెన్నై కథ ముగిసింది. ఇక ఆ జట్టు తదుపరి సీజన్లోనే కనపడనుంది. టోర్నీ ఆరంభం నుంచీ ధోనీసేన ఎన్నడూ ఇలా ప్లేఆఫ్స్కు చేరకుండా ఇంటిముఖం పట్టలేదు. ఈసారి కెప్టెన్ ఎంఎస్ ధోనీ సైతం ఫామ్లో లేకపోవడం చెన్నైకి నిరాశ కలిగించే అంశం.
ఆదివారం చెన్నై చివరి లీగ్ ఆడిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ... 'మా ముందు అతి పెద్ద చాలెంజ్ ఉంది. అత్యంత బాధ్యతగా పటిష్ట జట్టును ఎంపిక చేయడానికి కసరత్తులు చేస్తాం. రుతురాజ్ గైక్వాడ్ లాంటి యువ క్రికెటర్లతో పాటు పాత క్రికెటర్లతో సీఎస్కేను సమ్మేళనం చేస్తాం. ఎప్పుడూ సీఎస్కే జట్టు ఎంపికలో యజమాని శ్రీనివాసన్ కీలకంగా వ్యవహరిస్తారు. సీఎస్కే మేనేజ్మెంట్, శ్రీనివాసన్లు వారికి మంచిదైన జట్టునే ఎంపిక చేస్తారు. దాన్ని వచ్చే ఐపీఎల్లో కూడా అవలంభిస్తాం' అని తెలిపాడు.
'మేము గత 10-12 ఏళ్లుగా నిలకడైన క్రికెట్ ఆడుతున్నామంటే.. జట్టు ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అది పెద్ద బాధ్యత. మా జట్టులో టాలెంట్ ఉంది. కానీ జట్టును ఎలా మిక్స్ చేయాలనే అంశంపై కసరత్తులు చేయనున్నాం' అని చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. ఈ సీజన్లో చెన్నై తన లీగ్ దశను ఆరు విజయాలతో ముగించింది. టోర్నీ నుంచి నిష్క్రమించినా వరుసగా మూడు విజయాలు సాధించడంతో మునపటి సీఎస్కేను గుర్తు చేశాయి. వరుస విజయాలు సాధించడంతో ఎంఎస్ ధోనీ మీద వచ్చిన విమర్శలకు కూడా చెక్ పడింది.
ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో తన చివర మ్యాచ్లో చెన్నై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా టాస్ వేసే సమయంలో వ్యాఖ్యాత డానీ మోరిసన్ ఇదే మీ చివరి సీజనా అని ధోనీని అడిగాడు. అందుకు స్పందించిన అతడు కచ్చితంగా కాదని స్పష్టం చేశాడు. దాంతో చెన్నై అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఓపెనర్ షేన్ వాట్సన్ మాత్రం ఐపీఎల్ 2021 ఆడే అవకాశం లేదు. ఎందుకంటే.. వాట్సన్ అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్ బై చెప్పాడు.