అధికారిక ప్రకటన రాలేదు
ఐపీఎల్ 2020 మార్చి 29న ప్రారంభం అవుతుందనని ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దానిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఎక్కువ మంది విదేశీ ఆటగాళ్లు ఏప్రిల్ 1 తర్వాతే భారత్ రానున్న నేపథ్యంలో ఆరంభ తేదీ మారే అవకాశం ఉందని మొన్నటివరకు వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఐసీసీ కూడా ఆరంభ తేదీకి అడ్డుగా మారనుంది.
మెట్టుదిగిరాని ఐసీసీ
మార్చి 29న ఐసీసీ దుబాయ్ వేదికగా బోర్డు మీటింగ్ను ఏర్పాటు చేసింది. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీతో పాటు బోర్డులోని మరికొందరు ఉన్నతాధికారులు ఆ సమావేశానికి హాజరుకానున్నారు. మార్చి 29నే ఐపీఎల్ ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో.. తాజాగా లేఖ ద్వారా మీటింగ్ తేదీని మార్చాలని ఐసీసీని బీసీసీఐ కోరింది. బీసీసీఐ అభ్యర్థనని ఐసీసీ తిరస్కరించింది. దీంతో ఐపీఎల్ ప్రారంభ తేదీని మార్చాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇక ఆల్ స్టార్స్ మ్యాచ్ నిర్వహణ కూడా అనుమానంగానే ఉంది.
దాదా ఏదైనా మ్యాజిక్ చేస్తాడా
ఐపీఎల్ 2019 సీజన్ ముందు పుల్వామా ఉగ్రదాడిలో భారత జవాన్లు మరణించడంతో.. గత ఏడాది ఆరంభోత్సవాన్ని బీసీసీఐ నిర్వహించలేదు. అయితే ఈసారి మాత్రం అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. కానీ.. ఇప్పుడు ఐసీసీ అడ్డుపడుతోంది. మరి ఐసీసీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్న దాదా ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.
క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ
2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా.. ఇప్పటి వరకూ 12 సీజన్లు విజయవంతంగా ముగిశాయి. అత్యధికంగా ముంబై ఇండియన్స్ నాలుగు సార్లు టైటిల్ గెలుచుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు కైవసం చేసుకుంది. ఐపీఎల్ ఎంతోమంది ఆటగాళ్లను జాతీయ జట్లకు పరిచయం చేసింది. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న టోర్నీగా వెలుగుతోంది. పాకిస్థాన్ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, బిగ్బాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ తదితర టోర్నీలు వచ్చినా.. ఐపీఎల్కి మాత్రం పోటీనివ్వలేకపోతున్నాయి.