
దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ మోస్తరు స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 రన్స్ చేసి.. రాజస్థాన్ ముందు 159 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మనీశ్ పాండే (54: 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు ) అర్ధ సెంచరీకి చేయగా.. డేవిడ్ వార్నర్ (48: 38 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో హైదరాబాద్ బ్యాట్స్మెన్లు పరుగులు చేయడానికి కాస్త కష్టపడ్డారు. పాండే సహా చివర్లో కేన్ విలియమ్సన్ (22నాటౌట్ 12 బంతుల్లో 2 సిక్సర్లు ) విరుచుకుపడడంతో సన్రైజర్స్ ఆ మాత్రం స్కోర్ చేసింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, కార్తీక్ త్యాగీ, జయదేవ్ ఉనద్కత్ తలో వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ పిచ్పై పరుగులు సాధించేందుకు తెగ కష్టపడింది. ఆరంభంలో రాజస్థాన్ పేస్, స్పిన్ బౌలర్లు చక్కటి లైన్ అండ్ లెంగ్త్ బంతులతో కట్టడి చేయడంతో పవర్ప్లేలో హైదరాబాద్ 26 పరుగులే చేసింది. స్టార్ ఆటగాళ్లు జానీ బెయిర్స్టో, డేవిడ్ వార్నర్ క్రీజులో ఉన్నా.. వేగంగా ఆడలేకపోయారు. దూకుడుగా ఆడే క్రమంలో కార్తీక్ త్యాగీ బౌలింగ్లో బెయిర్స్టో (16) ఔటయ్యాడు. దీంతో హైదరాబాద్ 23 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. పిచ్ నుంచి ఆశించిన సహకారం లభించకపోవడంతో బ్యాట్స్మెన్ ఆచితూచి ఆడారు.
10 ఓవర్లకు 63/1తో ఉన్న సన్రైజర్స్ స్కోర్.. 15 ఓవర్లకు 96/2తో కోలుకున్నది. డాషింగ్ ఓపెనర్ వార్నర్ బ్యాట్ను ఝుళిపించడంతో పాటు మనీశ్ పాండే నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. రెండో వికెట్కు 73 పరుగులు జోడించారు. రన్రేట్ తక్కువగా ఉండటంతో వేగంగా ఆడేందుకు ప్రయత్నించిన వార్నర్.. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. వార్నర్ ఔటైన తర్వాత మనీశ్ పాండే దూకుడు పెంచాడు.
రాహుల్ తెవాటియా వేసిన 16వ ఓవర్లో మనీష్ పాండే ఫోర్, సిక్సర్ బాది 13 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే 40 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఉనద్కత్ వేసిన 18వ ఓవర్లో భారీ షాట్కు యత్నించిన మనీశ్.. తెవాటియాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చివర్లో విలియమ్సన్, ప్రియం గార్గ్ (15: 8 బంతుల్లో ఫోర్, సిక్సర్ ) తమదైన శైలిలో రెచ్చిపోయి జట్టు స్కోరును 150 దాటించారు. దీంతో రాజస్థాన్ ముందు 159 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది సన్రైజర్స్.