
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా మరికొద్ది సేపట్లో దుబాయ్ వేదికగా డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్రైజర్స్ హైదరాబాద్, కేఎల్ రాహుల్ నేతృత్వంలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన సన్రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఒక మార్పుతో వార్నర్ సేన బరిలోకి దిగుతోంది. సిద్దార్థ్ కౌల్ స్థానంలో ఖలీల్ అహ్మద్ జట్టులోకి వచ్చాడు. తెలుగు కుర్రాడు పృథ్వీ రాజ్ యర్రాకు నిరాశే ఎదురైంది. మరోవైపు రాహుల్ తుది జట్టులో మూడు మార్పులు చేశాడు.
వరుస ఓటములతో లీగ్ను మొదలుపెట్టిన సన్రైజర్స్ విజయాల బాట పట్టిందనుకున్న తరుణంలోనే గత మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో అనూహ్యంగా కంగుతిన్నది. దీంతో ఈ మ్యాచ్లో సత్తాచాటి గాడిలో పడాలని వార్నర్ సేన పట్టుదలగా ఉంది. 13వ సీజన్లో రెండు జట్లు తలపడడం ఇదే తొలిసారి. ఆడిన ఐదు మ్యాచుల్లో రెండు విజయాలతో సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉండగా.. ఐదు మ్యాచులాడి కేవలం ఒకేఒక్క విజయంతో చివరి స్థానంలో పంజాబ్ ఉంది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. కాబట్టి మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం.
హైదరాబాద్, పంజాబ్ ఇప్పటి వరకూ 14సార్లు తలపడ్డాయి. అందులో హైదరాబాద్ 10 విజయాలతో ముందంజలో ఉంది. పంజాబ్ కేవలం నాలుగింట్లో మాత్రమే గెలుపొందింది. ఈ రెండు జట్లు తలపడ్డ గత ఐదు మ్యాచుల్లో మూడింట్లో హైదరాబాద్, రెండింట్లో పంజాబ్ గెలిచాయి. ఈ మైదానంలో హైదరాబాద్ నాలుగు మ్యాచ్లాడి మూడింట్లో విజయం సాధించింది. పంజాబ్ కూడా నాలుగు మ్యాచ్లాడి రెండింట్లో గెలిచింది.
హైదరాబాద్, పంజాబ్ మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇదే మైదానంలో గతంలో చెన్నై సూపర్ కింగ్స్ 178 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది. ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ సైతం ప్రత్యర్థి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు 196 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
తుది జట్లు:
హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రశీద్ ఖాన్, సందీప్ శర్మ, టీ నటరాజన్, ఖలీల్ అహ్మద్.
పంజాబ్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, మన్దీప్ సింగ్, నికోలస్ పూరన్, సిమ్రాన్ సింగ్, గ్లెన్ మ్యాక్స్వెల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ముజీబ్ ఉర్ రహ్మన్, మహమ్మద్ షమీ, షెల్డన్ కాట్రెల్.