
దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ జానీ బెయిర్స్టో హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 28 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. అర్ష్దీప్ సింగ్ వేసిన పదో ఓవర్ మూడో బంతికి రెండు పరుగులు చేసిన బెయిర్స్టో.. అర్ధ శతకం చేశాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ధాటిగా ఆడుతున్నాడు. దీంతో సన్రైజర్స్ స్కోర్ బోర్డు పరుగులు పెడుతోంది.
ఈ జోడి ఇప్పటికే 100 పరుగుల భాగస్వామ్యంను నెలకొల్పింది. ఇద్దరు 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ఇది ఆరోసారి.16 ఇన్నింగ్స్లలోనే వార్నర్, బెయిర్స్టోలు ఈ మార్క్ అందుకున్నారు. కోహ్లీ-ఏబీలు 9.. కోహ్లీ-గేల్ 9.. వార్నర్-ధావన్ 6, గంభీర్-ఉతప్ప 5 100 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్కు మెరుపు ఆరంభం లభించింది. ఓపెనర్లు వార్నర్, బెయిర్స్టో పవర్ప్లేలో భారీ హిట్టింగ్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. షెల్డన్ కాట్రెల్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వార్నర్ వరుసగా రెండు ఫోర్లు బాదగా.. 5 ఎక్స్ట్రా రన్స్ రావడంతో 13 పరుగులు వచ్చాయి. అనూహ్యంగా రెండో ఓవర్లోనే పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. స్పిన్నర్ ముజీబ్ను రంగంలోకి దించాడు. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న ముజీబ్ కేవలం 6 పరుగులు ఇచ్చాడు.
కాట్రెల్ వేసిన నాలుగో ఓవర్లో బెయిర్స్టో మూడు ఫోర్లు కొట్టి టచ్లోకి వచ్చాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ముజీబ్, మ్యాక్సీ వేసిన 6, 7 ఓవర్లో పరుగులు రావడం కష్టమైంది. అయితే రవి బిష్ణోయ్ వేసిన 8వ ఓవర్లో బెయిర్స్టో రెండు సిక్సులు, ఫోర్ బాది 18 పరుగులు పిండుకున్నాడు. ఇక 9వ ఓవర్లో అర్ధ శతకం చేశాడు. ఆపై బెయిర్స్టో మరింత దూకుడుగా ఆడుతున్నాడు. ఫోరులు సిక్సులతో విరుచుకుపడుతున్నాడు. సన్రైజర్స్ 16 ఓవర్లకు వికెట్ కోల్పోకుండా 160 పరుగులు చేసింది.