
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో పలువురు యువ క్రికెటర్లు వెలుగులోకి రావడంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఆరుగురు టాలెంటెడ్ క్రికెటర్లు తమకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నారన్నాడు. యూఏఈ వేదికగా జరుగుతున్నా ప్రస్తుత సీజన్తో ఏ ఒక్క ఆటగాడో వెలుగులోకి రాలేదని, యువ క్రికెటర్ల బెంచ్లో చాలా మంది ఆకట్టుకోవడం మంచి పరిణామమన్నాడు. సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, వరుణ్ చక్రవర్తి, శుబ్మన్ గిల్, సంజూ శాంసన్, దేవదూత్ పడిక్కల్లు తమలోని సత్తాను నిరూపించుకున్నారని దాదా చెప్పడు.
ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో గత మూడేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. రంజీల్లో కూడా సత్తా చాటుతున్నాడు. అయినా కూడా సూర్యకుమార్ ఆస్ట్రేలియా టూర్కు ఎంపిక కాలేదు. ఈ ఐపీఎల్ ప్రదర్శన చూసి ఈసారి భారత టీ20 జట్టులో అతడికి కచ్చితంగా చోటు దక్కుతుందని మాజీలు అంచనా వేశారు. కానీ బీసీసీఐ సెలక్టర్లు మాత్రం సూర్యకుమార్కు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఈ విషయం పెద్ద చర్చకు దారి తీసింది.
సూర్యకుమార్ యాదవ్కు భారత జట్టులో చోటు దక్కలేదనే నేపథ్యంలో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ... 'ఈ ఐపీఎల్ కేవలం సూర్యకుమార్ యాదవ్ మాత్రమే ఆకట్టుకోలేదు. చాలామంది యువ క్రికెటర్లు మెరిశారు. భారత క్రికెట్ జట్టులో కొంతమంది యంగ్ క్రికెటర్లకు చోటు దక్కింది. సూర్యకుమార్కు గొప్ప ఆటగాడు. అతనికి కూడా సమయం వస్తుంది' అని చెప్పాడు. 2018 ఐపీఎల్లో ముంబై తరఫున 14 మ్యాచ్ల్లో 512 రన్స్ చేసిన సూర్యకుమార్ .. 2019లో 16 మ్యాచ్ల్లో 424 పరుగులు చేశాడు. ఇక ఈ సీజన్లో 14 మ్యాచ్ల్లో 410 రన్స్ చేశాడు.
సూర్యకుమార్ యాదవ్తో పాటు రాజస్థాన్ రాయల్స్కు చెందిన సంజూ శాంసన్.. కోల్కతాకు చెందిన రాహుల్ త్రిపాఠి, వరుణ్ చక్రవర్తి, శుభ్మన్ గిల్.. బెంగళూరు యువ ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ బాగా ఆడుతున్నారని సౌరవ్ గంగూలీ ప్రశంసించాడు. శాంసన్, చక్రవర్తి ఇద్దరూ ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. చక్రవర్తి భారత జట్టుకు ఎంపికవడం ఇదే తొలిసారి.