మార్చి 31 వరకు అంతర్జాతీయ మ్యాచ్లు:
లీగ్ ప్రారంభ సమయానికి (మార్చి 29న) అంతర్జాతీయ మ్యాచ్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ టీ20 సిరీస్ మార్చి 29న, ఇంగ్లాండ్-శ్రీలంక టెస్ట్ సిరీస్ మార్చి 31తో ముగుస్తుంది. దీంతో తొలి రెండు ఐపీఎల్ మ్యాచ్లకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంకకు చెందిన కొందరు ఆటగాళ్లు దూరం కానున్నారు. మార్చి 31తో దాదాపుగా అంతర్జాతీయ సిరీస్లన్నీ ముగియనుండడంతో ఆ తర్వాత అన్ని దేశాలకు చెందిన ప్లేయర్లు ఆయా ఐపీఎల్ జట్లతో కలుస్తారు.
29 నుంచి ఐపీఎల్ ప్రారంభం:
ఏప్రిల్ 1న ఐపీఎల్ను ప్రారంభించాలని కొన్ని ఫ్రాంచైజీలు గతంలో విన్నవించినా.. ఐపీఎల్ కౌన్సిల్ మాత్రం మార్చి 29నే లీగ్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఓ ఫ్రాంచైజీ సీనియర్ అధికారి మాట్లాడుతూ... 'లీగ్ ఆరంభం నాటికి ఆస్ట్రేలియా-న్యూజిలాండ్, ఇంగ్లాండ్-శ్రీలంక జట్లకు సిరీస్లు ఉన్నాయి. దీంతో స్టార్ ఆటగాళ్లు లేకుండా లీగ్ ఆరంబించాల్సి ఉంటుంది. ఇది మనకు మంచిది కాదు. ఏప్రిల్ 1 నుండి ప్రారంభిస్తే బాగుంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం మరి' అని అన్నాడు.
కమ్మిన్స్కు జాక్పాట్:
ఐపీఎల్ 13 సీజన్కు సంబంధించిన వేలం ఈ నెల 19న ముగిసింది. కోల్కతా వేదికగా జరిగిన వేలంలో పలువురు క్రికెటర్లకు ఊహించని ధరలు దక్కగా.. చాలామంది స్టార్ క్రికెటర్లకు నిరాశే ఎదురైంది. ఆసీస్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ 15 కోట్లకు పైగా అమ్ముడు పోగా.. మరో స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ రూ. 10.5 కోట్లకు అమ్ముడుపోయాడు. ఆరోన్ ఫించ్, క్రిస్ లిన్, క్రిస్ మోరిస్, కాట్రెల్, అలెక్స్ క్యారీ, సామ్ కర్రన్, హెట్మెయిర్ లాంటి ఆటగాళ్లకు మంచి ధరే పలికింది.
రాత్రికి రాత్రే కోటీశ్వరులు
ఇక అందరూ ఊహించినట్టుగానే యువ ఆటగాళ్లపై కూడా ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించాయి. భారత అండర్-19 స్టార్స్ యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్, ప్రియం గార్గ్, విరాట్ సింగ్ కోసం ప్రాంఛైజీలు పోటీపడ్డాయి. వారి కనీస ధర కంటే పది రెట్లు ఎక్కువకు దక్కించుకోవడంతో.. జూనియర్ ఆటగాళ్లు అందరూ రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు.