
ముంబై: గత మంగళవారం ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్కు అదిరిపోయే ఆదరణ లభించింది. కరోనా మహమ్మారి కష్ట కాలంలో.. యూఏఈ వేదికగా బయో బబుల్ వాతావరణంలో ప్రేక్షకులను అనుమతించకుండా నిర్వహించిన ఈ మెగా లీగ్కు ప్రేక్షకులు టీవీల్లో బ్రహ్మరథం పట్టారు. గత సీజన్తో పోలిస్తే.. డిజిటల్ ప్రేక్షకాదరణలో 28 శాతం పెరుగుదల నమోదవడం గమనార్హం.
కరోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా యూఏఈలో ముగిసిన ఐపీఎల్ 2020కి అభిమానులను అనుమతించని విషయం తెలిసిందే. ప్రాంఛైజీలు, అధికారులు మాత్రమే నేరుగా చూశారు. దీంతో టీవీలతో పాటు వివిధ ప్రసార మాధ్యమాల్లో ఐపీఎల్ మ్యాచ్లను అత్యధిక ప్రజలు చూసేందుకు ఆసక్తి కనబరిచారు. వైరస్ సవాళ్లను దాటి, కఠిన పరిస్థితుల్లో నిర్వాహకులు విజయవంతంగా నిర్వహించిన ఈ లీగ్లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే.
రికార్డు స్థాయిలో 28 శాతం అధికంగా నమోదైనట్టు ఐపీఎల్ చెర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపాడు. కానీ వ్యూయర్షి్పనకు సంబంధించిన గణాంకాలను మాత్రం విడుదల చేయలేదు. 'ప్రపంచ స్థాయి క్రీడా టోర్నీ అనుభూతిని అభిమానులకు అందించడం కోసం ఐపీఎల్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. టైటిల్ స్పాన్సరర్గా డ్రీమ్లెవన్ రావడంతో.. ఫాంటసీ క్రీడల ద్వారా ఫ్యాన్స్తో మంచి సాంగత్యం ఏర్పడింది. ఫ్యాన్ వాల్స్, వర్చువల్ గెస్ట్ బాక్స్లు మరింతగా ఆకర్షించాయి' అని పటేల్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2021లో మరో కొత్త జట్టు రానుందని సమాచారం. 9వ జట్టుగా గుజరాత్ ఆడనుందని తెలుస్తోంది. అహ్మదాబాద్ బేస్డ్గా ఏర్పాటయ్యే కొత్త ఫ్రాంచైజీని కొనుగోలుచేయడానికి ఓ కార్పొరేట్ దిగ్గజం సిద్ధంగా కూడా ఉందని సమాచారం. మరోవైపు హీరో మోహన్ లాల్ కూడా ఫ్రాంచైజీ కోసం ప్రయత్నాలు చేతున్నారట. ఏదేమైనా వచ్చే ఏడాది కొత్త జట్టు రావడం మాత్రం ఖాయం.