గెలిపించిన రవీంద్ర జడేజా..
కోల్కతతో జరిగిన మ్యాచ్లో చెన్నై గెలవడానికి ప్రధాన కారణం.. రవీంద్ర జడేజా. చివరి ఓవర్లలో పిడుగుల్లాంటి షాట్లతో విరుచుకుని పడ్డాడతను. 11 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. మెరుపువేగంతో ఆడిన లెఫ్ట్ హ్యాండ్ ఆల్రౌండర్.. తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఫలితం లేని గెలుపు అది. ఈ టోర్నమెంట్లో ముందుకు వెళ్లడానికి చెన్నై సూపర్ కింగ్స్కు ఏ రకంగానూ ఉపయోగపడదు.
16 బంతుల్లో ట్విస్టులు..
రవీంద్ర జడేజా క్రీజ్లోకి వచ్చే సరికి మ్యాచ్ దాదాపు కోల్కత చేతుల్లోకి వెళ్లినట్టే కనిపించింది. చివరి 16 బంతుల్లో 38 పరుగులను చేయాల్సిన దశ అది. దాన్ని సుసాధ్యం చేశాడు జడేజా. చివరి 12 బంతుల్లో సరిగ్గా 30 పరుగులు చేయాల్సిన దశలో రవీంద్ర జడేజా విజృంభించి ఆడాడు. లోకీ ఫెర్గూసన్ వేసిన 19వ ఓవర్లో ఒక సిక్సర్, రెండు ఫోర్లు బాదాడు. ఆ ఓవర్లో 20 పరుగులొచ్చాయి. దీనితో ఈక్వేషన్లు పూర్తిగా మారిపోయాయి. చివరి ఆరు బంతుల్లో 10 పరుగుల చేయాల్సి వచ్చింది చెన్నై.
చివరి ఓవర్లో అదే బాదుడు..
కమలేష్ నగర్కోటి వేసిన చివరి ఓవర్లో తన బాదుడును కొనసాగించాడతను చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. తన జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. కోల్కత చేతుల్లోకి వెళ్లిన మ్యాచ్ను వెనక్కి లాక్కొచ్చాడు. ఈ గెలుపు చెన్నై సూపర్ కింగ్స్కు ఉపయోగపడదు గానీ.. కోల్కతకు మాత్రం పీడకలను మిగిల్చుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఎందుకంటే- ప్లేఆఫ్కు చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ అది.
జడేజా దూకుడు మంత్రానికి ధోనీ భార్య ఫిదా..
రవీంద్ర జడేజా ఆడిన తీరు చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షిని కట్టిపడేసింది. అతని బ్యాటింగ్ శైలికి ఫిదా అయిందామె. అతణ్ని ఆకాశానికెత్తేసింది. జడేజాను పొగుడుతూ సోషల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఎల్లో రంగు జెర్సీని ధరించిన రవీంద్ర జడేజా ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన సాక్షి ధోనీ.. దానికి బాప్ రే బాప్.. రవీంద్ర జడేజా అనే కామెంట్స్ను యాడ్ చేసింది. చివరి ఓవర్లలో రవీంద్ర జడేజా ఆడిన తీరు క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుని తీరుతాయి. అతను ప్రదర్శించిన ఫైటింగ్ స్పిరిట్ అలాంటిది.