
ముంబై నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జేమ్స్ ప్యాటిన్సన్ వేసిన రెండో ఓవర్ ఐదో బంతికి రాబిన్ ఉతప్ప (13) కీరన్ పొలార్డ్ చేతికి చిక్కాడు. అయితే ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో బెన్ స్టోక్స్ మొత్తం నాలుగు ఫోర్లు బాదడంతో స్కోర్ వేగం పెరిగింది. బుమ్రా వేసిన నాలుగో ఓవర్ ఐదో బంతికి స్టీవ్ స్మిత్ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాతి ఓవర్లో స్మిత్ ఔట్ అయ్యాడు. ప్యాటిన్సన్ వేసిన ఐదో ఓవర్ నాలుగో బంతికి స్మిత్ (11) బౌల్డ్ అయ్యాడు.పవర్ ప్లే ముగిసేసరికి రాజస్థాన్ రెండు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది.
ఈ సమయంలో బెన్ స్టోక్స్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే సంజూ శాంసన్ మాత్రం ఆచితూచి ఆడాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న స్టోక్స్.. 28 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక 10 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 2 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ఆపై రాజస్థాన్ జోరు తగ్గింది. జస్ప్రీత్ బుమ్రా 11వ ఓవర్లో రాజస్థాన్ 5 పరుగులే రాబట్టింది. ఇక రాహుల్ చాహర్ వేసిన 12వ ఓవర్లో రాజస్థాన్ 3 పరుగులే చేసింది.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (60 నాటౌట్; 21 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (40; 26 బంతుల్లో 4×4, 1×6), ఇషాన్ కిషన్ (37; 36 బంతుల్లో 4×4, 1×6), సౌరభ్ తివారి (33; 23 బంతుల్లో 4×4, 1×6) కూడా రెచ్చిపోవడంతో ముంబై భారీ స్కోరు చేసింది.